
Gujarat Rain: గుజరాత్ జలమయం.. భారీ వరదలతో పాఠశాలలకు సెలవులు
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా సూరత్ నగరం భారీ వరదల ముంచెత్తడంతో రహదారులన్నీ నీట మునిగాయి. భద్రతా కారణాల రీత్యా జిల్లా పాఠశాలలకు అధికారులు సెలవులను ప్రకటించారు. భారీ వరదల కారణంగా విద్యార్థులను బయటకు రానివ్వకూడదని, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం కోరింది. గత 24 గంటల్లో సుమారు 6 అంగుళాల వర్షం కురిసినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. సూరత్, వల్సాద్, జామ్నగర్, జునాగఢ్ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Details
లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక
అహ్మదాబాద్, రాజ్కోట్, గాంధీనగర్, మెహ్సానా తదితర నగరాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అలాగే అమ్రేలి, భావ్నగర్, నవ్సారి, వడోదర జిల్లాలకు కూడా ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతింది. రానున్న రోజుల్లోనూ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, పౌరులు భద్రతా మార్గదర్శకాలను పాటించాలని ప్రభుత్వ అధికారులు కోరారు.