
Modi-Putin: పుతిన్ ను కలవడం సంతోషంగా ఉంది.. ఎక్స్లో షేర్ చేసిన మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలోని తియాన్జిన్లో సోమవారం షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) 25వ శిఖరాగ్ర సదస్సు అధికారికంగా ప్రారంభమైంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధ్యక్షతన ఈ సదస్సు కొనసాగుతోంది. ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు అనేక దేశాధినేతలు పాల్గొన్నారు. సదస్సు ప్రారంభ వేళ ప్రధాని మోదీ, పుతిన్ను ఆత్మీయంగా పలకరించారు. ఇద్దరూ చేతులు కలుపుకొని ఆలింగనం చేసుకున్నారు. ఆ చిత్రాలను మోదీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ, "పుతిన్ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాగే జిన్పింగ్, పుతిన్తో మాట్లాడుతున్న ఫొటోలను కూడా పంచుతూ తియాన్జిన్లో చర్చలు కొనసాగుతున్నాయని రాశారు. సదస్సులో తర్వాత ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు.
Details
మోదీ - పుతిన్ ద్వైపాక్షిక భేటీపై ఆసక్తి
ఈ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక సమావేశం కానున్నారు. ముఖ్యంగా రష్యా నుంచి చమురు దిగుమతి, అమెరికా విధించిన అదనపు సుంకాలు, ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలపై వీరి చర్చకు ఆసక్తి నెలకొంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో అమెరికా అదనపు సుంకాలను 50శాతం వరకు పెంచింది. ఈ టారిఫ్లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. రష్యా చమురు విక్రయాల ద్వారా వచ్చిన నిధులతో మాస్కో యుద్ధం కొనసాగిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేశారు. దీన్ని భారత్ స్పష్టంగా తోసిపుచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కారణంగానే రష్యా నుంచి దిగుమతులు చేస్తున్నామని భారత్ ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేసింది.