Haryana: ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన కారు .. 6 మంది మృతి, 6 మందికి గాయాలు
హర్యానాలోని రేవారీలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎక్స్యూవీ టైర్ పంచర్ కావడంతో మార్చుకునేందుకు వాహనాన్ని రోడ్డుపక్కన ఆపారు. అంతలో వేగంగా వచ్చిన మరో కారు దాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మాసాని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.కారు ఖాటూ గ్రామం నుంచి ఢిల్లీకి తిరిగి వస్తోంది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు మృతి చెందారు. ఖర్ఖరా గ్రామ సమీపంలో ఎక్స్యూవీలో ఉన్నవారు తమ వాహనం టైర్లను మారుస్తుండగా ఈ ఘటన జరిగింది. వెనుక నుంచి వస్తున్న మరో కారు వారిని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
కేసు నమోదు..దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసుల వెల్లడి
ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి వెళ్లారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.