
Damodar Raja Narasimha: కొవిడ్తో ముప్పు లేదు.. అప్రమత్తత అవసరం.. ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి దామోదర్
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
ప్రస్తుతం కొవిడ్ వల్ల ముప్పు కనిపించకపోయినా,జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను పరీక్షించాలని ఆయన వెల్లడించారు.
సోమవారం నాడు మంత్రి సచివాలయంలో ఓ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి, బీబీనగర్ ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అభిషేక్ అరోరా,సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ప్రింటింగ్ అండ్ డయాగ్నొస్టిక్స్ డైరెక్టర్ ఉల్లాస్ కొల్తూర్ సీతారామ్,ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ శాస్త్రవేత్త డాక్టర్ సుదీప్ ఘోష్,నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ప్రజారోగ్య సంచాలకుడు రవీందర్ నాయక్ తదితరులు హాజరయ్యారు.
వివరాలు
ఓపీ, ఐపీ రోగుల సంఖ్య పెరిగే అవకాశం
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వల్ల భయపడాల్సిన అవసరం లేదని స్పష్టంగా తెలిపారు.
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు కనిపిస్తున్నప్పటికీ,బాధితులు ఆసుపత్రుల్లో చేరే స్థితిలో లేరని తెలిపారు.
అయితే,దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
కొవిడ్ వైరస్కు సంబంధించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని సీసీఎంబీ మరియు సీడీఎఫ్డీ డైరెక్టర్లు మంత్రిని కోరగా,ఆ మేరకు అవసరమైన నమూనాలను పంపించాలని డీహెచ్ రవీందర్ నాయక్ను మంత్రి ఆదేశించారు.
అలాగే,రాష్ట్రంలో వర్షాలు మొదలవ్వడం వల్ల సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని,దీనితో ఆసుపత్రుల్లో ఓపీ, ఐపీ రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున,అన్ని రకాలుగా ముందస్తుగా సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.