Page Loader
Heatwaves: 13 జిల్లాల్లో వడగాలుల ముప్పు.. జూన్ వరకు జాగ్రత్త
13 జిల్లాల్లో వడగాలుల ముప్పు.. జూన్ వరకు జాగ్రత్త

Heatwaves: 13 జిల్లాల్లో వడగాలుల ముప్పు.. జూన్ వరకు జాగ్రత్త

వ్రాసిన వారు Jayachandra Akuri
May 04, 2025
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో వడగాలుల ముప్పు పెరుగుతోంది. ముఖ్యంగా 13 జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు. గత పదకొండేళ్ల గణాంకాలను పరిశీలిస్తే, ఈ జిల్లాల్లో సగటున 21 నుండి 40రోజులపాటు వడగాలులు నమోదయ్యాయని తేలింది. వడగాలుల ప్రభావం చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారిపై తీవ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక బయట పనిచేసే వర్గాలపై వడగాలుల ప్రభావం మరింతగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భయంకరమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల వడగాలులు మొదలయ్యాయి. ఈ నెలతో పాటు జూన్‌లోనూ పరిస్థితి తీవ్రంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వివరాలు హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్-2025లో పేర్కొన్నాయి.

Details

తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాలు ఇవే 

ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ. గడిచిన 11 ఏళ్ల గణాంకాలను బట్టి, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సగటున 10కిపైగా రోజులు వడగాలులు వీచాయి. మిగిలిన జిల్లాల్లో సగటున 5 నుంచి 9 రోజుల మధ్య నమోదయ్యాయి.

Details

పూర్వపు వడగాలుల దృష్టాంతాలు 

2015లో అత్యధికంగా 358 రోజులు వడగాలులు నమోదై, 541 మంది మృతి చెందారు. 2016లో 488 రోజుల్లో 324 మరణాలు చోటుచేసుకున్నాయి. 2017లో 89 రోజులకు 108 మంది మృత్యువాత పడ్డారు. 2019లో 161 రోజుల్లో 64 మంది మరణించారు. 2013లో వడదెబ్బల వల్ల 516 మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది వడగాలుల కారణంగా 10 మరణాలు నమోదయ్యాయి.

Details

తాజా సాంకేతికతతో ఉష్ణోగ్రతల అంచనా 

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ (TGDPs) ఆధ్వర్యంలో 1,089 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల (AWS) ద్వారా గంటకుగంట ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, వర్షపాతం వివరాలు నమోదవుతున్నాయి. ప్రతి 10 చదరపు కిలోమీటర్లకు ఒక AWS ఉండగా, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో ప్రతి 2 చదరపు కిలోమీటర్లకు ఒక కేంద్రం ఉంది. ఈ కేంద్రాల సమాచారం కంట్రోల్ సెంటర్లకు చేరి, వాట్సాప్, ఈమెయిల్, సందేశాల ద్వారా అధికారులకు అప్రమత్తత సలహాలు అందుతోంది. అంతేకాక ప్రధాన కూడళ్లు, జనసమ్మర్ద ప్రాంతాల్లో ఎల్‌ఈడీ తెరల ద్వారా హెచ్చరికలు అందిస్తున్నారు.

Details

జాగ్రత్తలు పాటించాల్సిన సూచనలివే 

ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ఎండలోకి వెళ్ళకూడదు. పుష్కలంగా నీరు లేదా పానీయాలు తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత 104°F (40°C) చేరితే వెంటనే ఆసుపత్రికి తరలించాలి. కార్మికులు మధ్యాహ్నం 1-2 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. సంస్థలు, పరిశ్రమలు రొటేషన్ విధానం అమలు చేయాలి. పట్టణాల్లో కూల్ వార్డులు ఏర్పాటు చేయాలి. * ఆసుపత్రుల్లో ఓఆర్‌ఎస్, సెలైన్ స్టాక్ సిద్ధంగా ఉంచారు. వడదెబ్బ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు పరిహారం అందిస్తుంది. త్రిసభ్య కమిటీ (రెవెన్యూ, పోలీస్, వైద్యశాఖలు) వడదెబ్బ మరణాలను నిర్ధారిస్తుంది.