
AP High Court: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్.. స్టే పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ ఆధారంగా జూన్ 6 నుంచి నిర్వహించనున్న రాత పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పరీక్షలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.
డీఎస్సీ పరీక్షల నిర్వహణను నిలిపివేయడానికి సహేతుక కారణాలు లేవని పేర్కొంటూ, ఈ అంశంపై అత్యవసర విచారణ (హౌజ్మోషన్) నిర్వహించిన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా,డీఎస్సీ పరీక్షల తుదిదశ ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో స్టే ఇవ్వలేమని పేర్కొన్న న్యాయస్థానం..ఇప్పటికే హాల్ టికెట్లు జారీ కావడం, పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తవడం వంటి అంశాలను గుర్తుచేసింది.
ఉద్యోగాల భర్తీ విషయంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది.
Details
పిటిషన్ల వివరాలు
1. టెట్ నిర్వహణపై అభ్యంతరం
2011లో జారీ చేసిన జీవో-51 ప్రకారం విద్యా సంవత్సరానికి రెండుసార్లు టెట్ నిర్వహించాల్సి ఉంటుందని, కానీ ఒక్కసారి మాత్రమే టెట్ నిర్వహించి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడం చట్ట విరుద్ధమని చిత్తూరు జిల్లాకు చెందిన పి. ప్రభాకర్ తదితరులు పిటిషన్ దాఖలు చేశారు.
2. వయోపరిమితిపై అభ్యంతరం
ఫిబ్రవరి 12న విడుదలైన డీఎస్సీ-2024 నోటిఫికేషన్కు వయస్సు పరంగా అర్హులమని, కానీ ఏప్రిల్ 20న విడుదలైన తాజా నోటిఫికేషన్ ప్రకారం అనర్హులమయ్యామని కొందరు అభ్యర్థులు పిటిషన్ వేశారు.
2024 నోటిఫికేషన్కు దరఖాస్తు చేసిన వారిని ప్రస్తుత డీఎస్సీకి అర్హులుగా గుర్తించాలని వారు కోరారు.
Details
3. భాష అర్హతపై అభ్యంతరం
సీబీఎస్ఈ పదో తరగతిలో మొదటి భాషగా ఆంగ్లం, రెండో భాషగా తెలుగును చదివిన అభ్యర్థుల దరఖాస్తులు తిరస్కరించడాన్ని ఎమ్మిగనూరుకు చెందిన వెలికంటి సాంబశివ వ్యాజ్యం ద్వారా సవాల్ చేశారు.
4. బీఈడీ చివరి సంవత్సరం విద్యార్థుల అర్హతపై అభ్యంతరం
ప్రస్తుతం బీఈడీ చివరి సంవత్సరం చదివే అభ్యర్థులను డీఎస్సీ నుంచి మినహాయించడం చట్ట విరుద్ధమని కొన్ని వ్యాజ్యాలు వేశారు.
45 రోజుల షెడ్యూల్ సరిపోదని అభిప్రాయపడ్డారు.
Details
ప్రభుత్వ వాదనలు
పాఠశాల విద్యాశాఖ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్. ప్రణతి పలు కీలక వాదనలు వినిపించారు
వయో పరిమితి పెంచాలని కోరుతున్న వారికి 2024 డీఎస్సీ నాటికే అర్హత లేదని పేర్కొన్నారు.
సీబీఎస్ఈ అభ్యర్థులలో చాలామంది మొదటి భాషగా ఆంగ్లాన్ని చదివినా.. నిర్ధిష్ట పోస్టులకు తప్ప మిగిలిన వాటికి వారు అర్హులేనన్నారు.
ఇప్పటికే హాల్ టికెట్లు జారీ చేసినందున పిటిషన్లను కొట్టేయాలని కోరారు.
న్యాయస్థాన వ్యాఖ్యలు
ఏడాదికి ఒకసారి టెట్ నిర్వహించడమే సరిపోతుందని ప్రభుత్వం జీవోలో పేర్కొన్నట్లు గుర్తుచేశారు.
పరీక్షలకు 90 రోజుల సమయం ఇవ్వాలన్న అభ్యర్థుల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.
బీఈడీ చివరి సంవత్సరం అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలన్న పిటిషన్లకూ న్యాయమూర్తి అనుమతిని నిరాకరించారు.