Page Loader
PM Modi Vizag Tour: ప్రధాని మోడీ విశాఖ పర్యటన కోసం భారీ ఏర్పాట్లు.. రోడ్ షో, సభపై ప్రత్యేక దృష్టి
ప్రధాని మోడీ విశాఖ పర్యటన కోసం భారీ ఏర్పాట్లు.. రోడ్ షో, సభపై ప్రత్యేక దృష్టి

PM Modi Vizag Tour: ప్రధాని మోడీ విశాఖ పర్యటన కోసం భారీ ఏర్పాట్లు.. రోడ్ షో, సభపై ప్రత్యేక దృష్టి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2025
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం పటిష్ఠమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు దిల్లీ నుండి ప్రత్యేక విమానంలో నేవల్ వైమానిక స్థావరం ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభ జరిగే ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. దత్త ఐలాండ్ నుండి ఏయూ గ్రౌండ్ వరకు భారీ రోడ్ షో నిర్వహించడానికి షెడ్యూల్ ఖరారైంది. 60 వేల మందికి పైగా ప్రజలు రోడ్ షోలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీ దాదాపు కిలోమీటరున్నర దూరం ఓపెన్ టాప్ వాహనంపై రోడ్ షో చేస్తారు.

Details

పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన

ఈ సందర్భంగా పీఎం వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు. ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఉత్తరాంధ్రలో చిరకాల కోరికగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం నిర్మాణం, పుడిమడకలో NTPC గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాలకు మోడీ శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులకు వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. ప్రధాని రోడ్ షో, బహిరంగ సభ వేదిక, జనసమీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజి మైదానంలో బహిరంగ సభకు ప్రధాన వేదిక పనులు వేగంగా జరుగుతున్నాయి.

Details

2 లక్షల మంది వచ్చే అవకాశం

ఈ సభకు విశాఖ, అనకాపల్లి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాదాపు 2 లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశముంది. జిల్లా యంత్రాంగం ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పుడిమడక, నక్కపల్లి దగ్గర పరిశ్రమలు ఏర్పాటయ్యే చోట ప్రధాని సభను వర్చువల్‌గా చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని మోదీ పర్యటించనందున, ఏర్పాట్లను మంత్రి లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లా ఎస్పీలు, కలెక్టర్లతో సమీక్షా సమావేశం కూడా జరుగుతోంది.