దిల్లీలో కుండపోత వర్షాలు.. జలమయమైన రోడ్లు, ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్న యమునా
దిల్లీలో కురుస్తున్న కుండపోత వర్షాలకు రాజధాని ప్రాంతంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతోంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వానలకు యమునా నదిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీనికి ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరద తోడవుతోంది. ఈ మేరకు నదిలో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. మరోవైపు హర్యానాలో కురుస్తున్న భారీ వర్షాలకు హత్నికుండ్ బ్యారేజీ గేట్లను ఎత్తివేశారు. దీంతో లక్షా 5 వేల 453 క్యూసెక్కుల నీటిని ఆదివారం సాయంత్రం 4 గంటలకు దిగువకు విడుదల చేశారు. అయితే మరో రెండు రోజుల్లో ఈ ప్రవాహం దిల్లీని చేరనుంది.
మంగళవారం దిల్లీకి వరద నీటి ముప్పు
ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం వరకు యమునా నది ప్రమాదకర స్థాయి మించి ప్రవహించనుంది. ఇప్పటికే దిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద ప్రస్తుతం 203.18 మీటర్ల మేర వరద ప్రవహిస్తోందని సెంట్రల్ వాటర్ కమిషన్ వెల్లడించింది. అయితే బ్రిడ్జి ప్రమాద స్థాయి నీటిమట్టం 204.5 మీటర్లుగా అధికారులు వెల్లడించారు. మరోవైపు హర్యానా నుంచి వచ్చే వరదతో ప్రవాహం 205.5 మీటర్లకు చేరుకోనున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య ప్రమాదకర స్థాయికి మించి ప్రవహించనుందన్నారు. ఈ నేపథ్యంలోనే దిల్లీ సర్కార్ అప్రమత్తమైంది. వరద పరిస్థితులను సమీక్షించేందుకు సెంట్రల్ కంట్రోల్ రూమ్ సహా 16 పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పరచింది.