నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కుంభవృష్టి.. రెడ్ అలెర్ట్ జారీ
తెలంగాణలోని ఉమ్మడి వరంగల్లో మంగళవారం భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. జనగామ, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు పడనున్నట్లు వెల్లడించింది. మరోవైపు భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం కురవనుందని వివరించింది. ఈ మేరకు 80 నుంచి 100 మిమీ మేర వర్షపాతం నమోదు కానున్నట్లు సూచించింది.గంటకు 30 నుంచి 50 కిమీ వేగంతో ఈదురు గాలులతో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల వాసులకు పునరావాసం కల్పించాలని ఆదేశించింది. రేషన్ సరఫరా సైతం చేయాలని అధికారులకు స్పష్టం చేసింది.
సాయం కోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ల ఏర్పాటు
కుంభవృష్టితో ఇబ్బందులు ఎదురైతే తక్షణ సాయం పొందేందుకు జిల్లా అధికారులు టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. హనుమకొండ : 1800 425 1115 వరంగల్ : 91542 52937 మహబూబాబాద్ : 79950 74803 భూపాలపల్లి : 90306 32608 / 1800 425 1123 ములుగు : 1800 425 7109 జనగామ : 63039 28718 వరంగల్ నగరపాలక సంస్థ : 1800 425 1980 ప్రసవానికి సిద్ధంగా ఉండే గర్భిణులను ముందస్తుగా ఆస్పత్రికి తరలించేలా ప్రణాళికలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఉద్ధృతంగా ప్రవహించే వరద మీదు నుంచి వాహనాలతో ఎట్టిపరిస్థితుల్లో వెళ్లకూడదని కోరింది. మత్స్యకారులు, గంగపుత్రులు చేపల వేటకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.