IMD: ముంబైకి భారీ వర్ష సూచన; యమునా నది మళ్లీ ఉగ్రరూపం
మహారాష్ట్రలో ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వేసింది. దీంతో ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలర్ట్లను జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముంబైలో గత 24గంటల్లో 255 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా బుధవారం మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దిల్లీలో తాజాగా కురుస్తున్న వర్షాల కారణంగా యమునా నదిలో నీటిమట్టం పెరిగి, మళ్లీ ప్రమాద స్థాయిని అధిగమించింది. దీంతో దిల్లీని వరద ముప్పు భయపెడుతోంది.
జమ్ముకశ్మీర్కు వరద ముప్పు
హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం మంగళవారం స్వల్పంగా పెరిగింది. మరోవైపు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో శనివారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే జమ్ముకశ్మీర్కు బుధవారం ఐఎండీ వరద హెచ్చరిక జారీ చేసింది. రియాసి జిల్లాలోని కత్రా ప్రాంతాలలో 24గంటల్లో 315.4మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ప్రవాహాలు , నదులు, హాని కలిగించే ప్రదేశాల నుంచి దూరంగా ఉండాలని ఐఎండీ సూచించింది. గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను భారీ వర్షం అతలాకుతలం చేసింది. వర్షాల కారణంగా సూరత్లోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ అయింది.