జమ్ముకశ్మీర్ ఎన్కౌంటర్: కుప్వారాలో ఐదుగురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య శుక్రవారం హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఇంకా ఉన్నారన్న సమాచారం మేరకు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్కౌంటర్లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారని, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని కశ్మీర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. జూన్ 13న కుప్వారా జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జూన్ 2న, జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.