
P Chidambaram: తమిళనాడులో ఓటర్ల పెరుగుదల ఆందోళనకరం.. చిదంబరం తీవ్ర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) నేపథ్యంలో ఎన్నికల సంఘం (Election Commission) చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ రాజకీయ వాతావరణాన్ని హీటెక్కించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం (P. Chidambaram) కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ఓటర్ల సంఖ్యలో అనూహ్యంగా పెరుగుదల జరిగిందని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం అని తెలిపారు. ఆదివారం ఆయన ఎక్స్ (మాజీ ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ, 'ఎస్ఐఆర్ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా మారుతోంది. బిహార్లో 65 లక్షల మంది ఓటు హక్కును కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. ఇదే సమయంలో తమిళనాడులో మాత్రం 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారు.
Details
అసలైన వలసదారులను అవమానించినట్లే
ఇది చట్టవిరుద్ధ చర్య. ప్రజాస్వామ్యానికి చేటు చేసే పని అని తీవ్రంగా విమర్శించారు. తమిళనాడులో పెరిగిన ఓటర్లను "శాశ్వత వలస కార్మికులు"గా పరిగణిస్తే, అసలైన వలసదారుల మనోభావాలను అవమానించినట్లవుతుందని చిదంబరం వ్యాఖ్యానించారు. ఇది ఓటర్లను ప్రేరేపించిన రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ, తమిళనాడు ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎంచుకునే హక్కు కోల్పోవాలన్న కుట్రకే ఈ పెంపుదల దారితీస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా చిదంబరం ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన అధికారాలను ఈసీ దుర్వినియోగం చేస్తోందని, రాష్ట్రాల ఎన్నికల విధానాల్లో చొరబడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
Details
ఈ చర్యను చట్టపరంగా ఎదుర్కోవాలి
ఈ చర్యలను రాజకీయంగా, చట్టపరంగా ఎదుర్కోవాలని విపక్ష పార్టీలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. తన వ్యాఖ్యల పోస్టుకు తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా ట్యాగ్ చేశారు. తమిళనాడు ఓటరు జాబితాలో వలస కార్మికులను చేర్చడంపై ఇప్పటికే అధికార డీఎంకేతో పాటు పలు ప్రాంతీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.