LOADING...
INDIA Bloc: నేడు ఇండియా కూటమి భేటీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ 
నేడు ఇండియా కూటమి భేటీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ

INDIA Bloc: నేడు ఇండియా కూటమి భేటీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2025
08:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా కూటమి నాయకులు సోమవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో ప్రతిపక్షం కూడా తన అభ్యర్థిని ప్రకటించే దిశగా ఆలోచిస్తోంది. మహారాష్ట్ర గవర్నర్ సీ.పి. రాధాకృష్ణన్‌ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలపగా, అతనికి పోటీగా సరైన వ్యక్తిని ప్రతిపక్షం ముందుకు తేవాలనే ప్రయత్నంలో ఉంది.

వివరాలు 

ఎన్డీఏ ఆధిక్యం స్పష్టమే 

ప్రస్తుత పరిస్థితుల్లో ఉప రాష్ట్రపతి పదవిని గెలుచుకునే అవకాశాలు ఎన్డీఏ కూటమికే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిత్రపక్షాల మద్దతుతో పాటు, గతంలో మద్దతు తెలిపిన బీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ వంటి తటస్థ పార్టీలను కూడా తమవైపు తిప్పుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. గత ఎన్నికల్లోనూ ఈ పార్టీలు ఎన్డీఏ అభ్యర్థి వైపు నిలిచాయి. అందువల్ల మరోసారి వాటి సహకారం పొందే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తోంది. అయినప్పటికీ ప్రతిపక్షం గట్టి పోటీ ఇచ్చి తమ ఐక్యతను చాటుకోవాలని భావిస్తోంది. అందుకే అభ్యర్థిని నిలబెట్టే దిశగా ముందుకు వెళ్తోంది.

వివరాలు 

సంఖ్యల లెక్కలు 

రాజ్యసభలో బీజేపీ వద్ద ప్రస్తుతం 102 సీట్లు ఉన్నాయి. మిత్రపక్షాల మద్దతుతో ఆ సంఖ్య 132కు చేరింది. అదనంగా ఏడుగురు నామినేటెడ్ సభ్యుల మద్దతు దక్కితే మొత్తం బలం 139కు పెరుగుతుంది. ఇక లోక్‌సభలో బీజేపీకి 240 మంది ఎంపీలు ఉన్నారు. మిత్రపక్షాలతో కలిపి ఈ సంఖ్య 293కి చేరింది. ఈ స్థితిలో ఎన్డీఏ అభ్యర్థి విజయాన్ని నిరోధించడం కష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఇండియా కూటమి వద్ద కాంగ్రెస్ పార్టీకి 99 లోక్‌సభ సభ్యులు ఉన్నారు. వారికి తోడు డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, వామపక్ష పార్టీల మద్దతు ఉన్నా, ఎన్డీఏ ఆధిపత్యాన్ని తగ్గించడం అంత సులభం కాదని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

ఎన్నికల షెడ్యూల్ 

ఉపరాష్ట్రపతి ఎన్నికలు సెప్టెంబర్ 9న జరగనున్నాయి. ప్రతిపక్షం అభ్యర్థిని నిలబెట్టకపోతే ఎన్డీఏ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అయితే విపక్షం పోటీ ఇచ్చే దిశగా ముందడుగు వేస్తే కనీసం తమ ఏకత్వాన్ని ప్రదర్శించే అవకాశం దక్కనుంది.