
Tulbul project: తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టు పునరుద్ధరణకు భారత్ సై!
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్కు గట్టి సంకేతం ఇవ్వాలన్న ఉద్దేశంతో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. సింధూ జలాల ఒప్పందాన్ని అమలు చేయడం తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్ నీటి కొరతలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పశ్చిమ దిశగా ప్రవహించే నదుల్లో నీటిని మరింతగా వినియోగించుకునేలా భారత్ విస్తృత ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా తులుబుల్ నావిగేషన్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీర్ఘకాలంగా నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును పునఃప్రారంభించేందుకు చర్చలు తుది దశలోకి చేరినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
వివరాలు
పశ్చిమ నదుల నీటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అనేక ప్రతిపాదనలు
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఖచ్చితమైన ప్రణాళిక (డీ.పి.ఆర్.)రూపొందించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నదని, ఇది సంవత్సరంలో పూర్తయ్యే అవకాశమున్నట్లు సమాచారం. అంతేకాదు, పశ్చిమ నదుల నీటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అనేక ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలనలో ఉంచినట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందులో భాగంగా, ఆ ప్రాంతంలోని ఒక నదిలోని నీటిని పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు మళ్లించే యోచన కూడా పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. 1960 సెప్టెంబర్ 19న భారత్-పాకిస్థాన్ల మధ్య జరిగిన సింధూ జలాల ఒప్పందం ప్రకారం,సింధూ, జీలం,చీనాబ్ నదులు పశ్చిమ దిశగా ప్రవహిస్తూ పాకిస్థాన్లోకి చేరుతాయి. వీటిపై భారత్కు పరిమిత హక్కులే ఉన్నా, మొత్తం నీటిలో 20శాతం వరకు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంది. మిగిలిన 80శాతం పాకిస్థాన్కి చెందుతుంది.
వివరాలు
వరదల సమయంలో కొన్ని సవాళ్లు
అయితే, భారతదేశంలో ఈ నదుల నుంచి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం తక్కువగా ఉండటమే ప్రధాన సమస్యగా మారిందని అధికారులు చెబుతున్నారు. ఎండాకాలంలో కొంతమేర నిల్వ చేయగలిగినప్పటికీ, వర్షాకాలంలో వచ్చే అధిక నీటిని నిల్వ చేయలేకపోవడం వల్ల అది నేరుగా పాకిస్థాన్కు వెళుతోంది. అంతేకాకుండా, ఒప్పందం ప్రకారం అమలు చేయాల్సిన విధానాల వల్ల వరదల సమయంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచే దిశగా రిజర్వాయర్ల నిర్వహణపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. గతంలో పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకించిన కిషన్గంగా ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి కాగా, రాట్లే ప్రాజెక్టు నిర్మాణం వేగంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.