అమెరికా నుంచి దశలవారీగా MQ 9B డ్రోన్ల కొనుగోలు చేయనున్న భారత్
రక్షణ రంగంలో భారత-అమెరికా బంధం రోజురోజుకు మరింత దృఢంగా తయారవుతోంది. తాజాగా మరో కీలక ఒప్పందానికి ప్రధాని మోదీ అమెరికా పర్యటన వేదిక కానుంది. ఈ నెల 21-14 తేదీల్లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా నుంచి దేశ సైనిక అవసరాల కోసం MQ 9Bడ్రోన్లను భారత్ దశలవారీగా కొనుగోలు చేయనుంది. ఈ డ్రోన్ల ఒప్పందం తర్వాత రెండోదశలో అమెరికా నుంచి ఆయుధాలను కొనుగోలు చేసేందుకు భారతదేశం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 3బిలియన్ డాలర్ల వ్యయంతో డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుంది. అమెరికా పర్యటనలో భాగంగా జో బైడెన్తో ఎంఓయూ ముగిసిన తర్వాత ఈ ఒప్పందం గురించి స్వయాన ప్రధాని మోదీ ప్రకటించే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
మొదటి బ్యాచ్ క్రింద 10డ్రోన్ల కొనుగోలు
అమెరికా నుంచి 31 హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్(హెచ్ఏఎల్ఈ) డ్రోన్లను భారత్ దశలవారీగా కొనుగోలు చేయనుంది. మొదటి బ్యాచ్ కింద 10డ్రోన్లను కొనుగోలు చేయనుంది. ఇవి ఆయుధాలు లేకుండా ఉంటాయి. ఇందులో మూడు డ్రోన్లను ఇంటెలిజెన్స్, నిఘా, నిఘా కమాండ్ సెంటర్ల కోసం ట్రై- సర్వీస్ కోసం కేటాయించనున్నారు. వాటిలో ఒకటి దక్షిణ భారతదేశంలో, మిగిలిన రెండు ఉత్తరభారతంలో మోహరించనున్నారు. ఆ రెండింటిలో చైనా బార్డర్లో ఒకటి తప్పనిసరి. జూన్ 15న, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డీఏసీ మొత్తం 31డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపింది. అందులో 15 MQ9B డ్రోన్లు సముద్ర రక్షణ కోసం, 16 స్కై గార్డియన్ డ్రోన్లను ట్రై-సర్వీస్ ప్రతిపాదనను కొనుగోలు చేయాలని నిర్ణయించారు.