భారత్-పాక్ మ్యాచ్లో 'జై శ్రీరాం' నినాదాలపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్.. తీవ్రంగా స్పదించిన బీజేపీ
అహ్మదాబాద్లో శనివారం జరిగిన భారత్-పాక్ ప్రపంచకప్ మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ క్రికెటర్ను అవహేళన చేసేలా 'జై శ్రీరామ్' నినాదాలు చేశారని డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ విమర్శించారు. స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల తీవ్రంగా స్పందించారు. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఈ విషయమై స్పందిస్తూ.. స్టాలిన్ విషం వ్యాప్తి చేసే దోమ అన్నారు. పాకిస్తాన్ వికెట్ కీపర్-బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ డక్ ఔటై వెళుతుండగా ప్రజలు నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. ఈ నినాదాలు క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని, క్రికెటర్ను వేధించడమేనని పలువురు అభిప్రాయపడ్డారు.
పాకిస్తాన్ ఆటగాళ్లతో వ్యవహరించిన తీరు ఆమోదయోగ్యం కాదు: స్టాలిన్
అయితే, పాక్ క్రికెటర్ రిజ్వాన్ మైదానంలో నమాజ్ చెయ్యడమే కాకుండా అంతకుముందు మ్యాచ్లో గాజా ప్రజలకు సంఘీభావం తెలిపారని కొందరు ఆరోపణలు చేశారు. భారతదేశం క్రీడాస్ఫూర్తి, ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందిందని, పొరుగు దేశానికి చెందిన ఆటగాళ్ల పట్ల వ్యవహరించడం మన దిగజారుడుతనానికి నిదర్శనమని అని స్టాలిన్ x లో రాసుకొచ్చారు. అయితే, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్తాన్ ఆటగాళ్లతో వ్యవహరించిన తీరు ఆమోదయోగ్యం కాదన్నారు. క్రీడలు దేశాల మధ్య ఏకం చేసే శక్తిగా ఉండాలి, నిజమైన సోదరభావాన్ని పెంపొందించి దానిని సాధనంగా ఉపయోగించాలే తప్ప ద్వేషాన్ని వ్యాప్తి చేయడం ఖండించదగినది అని ఆయన పోస్ట్ చేశారు.
స్టాలిన్ చేసిన పోస్ట్
స్టాలిన్ వ్యాఖ్యలపై స్పదించిన బీజేపీ
అంతకుముందు, స్టాలిన్ సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలతో దుమారం రేపారు.సనాతన ధర్మం సామాజిక న్యాయం ఆలోచనకు విరుద్ధమని, దానిని నిర్మూలించాలని అన్నారు. సనాతన ధర్మం అనేది మలేరియా,డెంగ్యూ లాంటిది, కాబట్టి దీనిని నిర్మూలించాలి కానీ వ్యతిరేకించకూడదని సెప్టెంబర్లో ఆయన అన్నారు. స్టాలిన్ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నాయకులు నిప్పులు చెరిగారు. స్టాలిన్ చేసిన తాజా వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందిస్తూ.."ఈ ద్వేషపూరిత డెంగ్యూ, మలేరియా దోమ మళ్లీ విషాన్ని వ్యాపింపజేస్తుంది. మైదానంలో నమాజ్ కోసం మ్యాచ్ ఆగిపోయినప్పుడు మీకు ఇబ్బంది లేదా," అని x లో పోస్ట్ చేశారు. "మా రాముడు విశ్వంలోని ప్రతి మూలలో నివసిస్తున్నాడు, కాబట్టి జై శ్రీరామ్ అని అనాలని" అని ఆయన అన్నారు.
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించిన గౌరవ్ భాటియా
పాక్ కెప్టెన్ కు బహుమతి ఇచ్చిన విరాట్
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే కూడా పాక్ క్రికెటర్ను రెచ్చగొట్టేలా నినాదాలు చేయడాన్ని తప్పుబట్టారు. ప్రపంచకప్లో శనివారం పాకిస్థాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచి ప్రపంచ కప్ లో వరుసగా ఎనిమిది విజయాలను నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్లోనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజంకు భారత ప్లేయర్ విరాట్ కోహ్లీ తన సంతకం చేసిన జెర్సీని గిఫ్ట్గా అందించాడు. కొన్ని మ్యాచ్లలో క్రికెటర్లను ఉద్దేశించి అభిమానులు ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదం అవుతోంది.