
Rajnath Singh: పహల్గాం ప్రస్తావన లేని SCO పత్రంపై సంతకం చేయనన్న భారత రక్షణ మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలో పర్యటనలో ఉన్న భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పహల్గాం ఉగ్రదాడి ఘటనతోపాటు సరిహద్దు ఉగ్రవాదంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమావేశం అనంతరం ఒక సంయుక్త ప్రకటన రూపొందించారు. అయితే, ఆ పత్రంలో పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో రాజ్నాథ్ సింగ్ అందుకు సంతకం చేయడాన్ని నిరాకరించారు. ఫలితంగా ఆ సంయుక్త ప్రకటనను రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సదస్సు చైనాలోని క్వింగ్డావోలో నిర్వహించగా, ఇందులో భారత్, చైనా, పాకిస్థాన్తో సహా మొత్తం 10 దేశాల రక్షణ మంత్రులు హాజరయ్యారు.
వివరాలు
ఉగ్రవాదంపై సభ్య దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు
సదస్సు అనంతరం రూపొందించిన సంయుక్త పత్రంలో భారత్ తీసుకునే గట్టి ఉగ్రవాద వ్యతిరేక నిశ్చయం స్పష్టంగా ప్రతిబింబించలేదు. ముఖ్యంగా ఏప్రిల్లో జమ్మూ కశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిని అందులో పేర్కొనలేదు. పైగా బలోచిస్తాన్ అంశాన్ని చేర్చి భారత్ను తప్పుబట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదంపై భారత నిశ్శబ్ద ప్రతిస్పందనకు విరుద్ధంగా ఉన్న ఆ పత్రంపై సంతకం చేయడం రాజ్నాథ్ సింగ్ అంగీకరించలేదు. ఉగ్రవాదంపై సభ్య దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తడంతో ఆ సంయుక్త ప్రకటనను SCO తాత్కాలికంగా విరమించింది. ఈ పత్రంలో పహల్గాం ఘటనను మినహాయించడంలో పాకిస్థాన్ పాత్ర ఉందన్న సంకేతాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ సదస్సుకు చైనా అధ్యక్షత వహించింది.
వివరాలు
2020 గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత.. భారత రక్షణ మంత్రి మొదటి చైనా పర్యటన
సదస్సులో మాట్లాడుతూ,కొన్ని దేశాలు సరిహద్దులపైన ఉగ్రవాదాన్ని ఒక రాజకీయ సాధనంగా వాడుకుంటున్నాయని రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. తమ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలు దీని తాలూకు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి,ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ రక్షణ మంత్రులు ఒకే వేదికపై కలుసుకోవడం ఇదే తొలిసారి. అయినప్పటికీ, ఈ ఇద్దరి మధ్య ఎలాంటి ప్రత్యక్ష సంభాషణలూ జరగలేదని విశ్వసనీయ సమాచారం. మరోవైపు, 2020 గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత భారత రక్షణ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే మొదటిది. SCOలో ప్రస్తుతం సభ్యదేశాలుగా బెలారస్, చైనా, భారత్, ఇరాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, పాకిస్థాన్, రష్యా, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్లు ఉన్నాయి.