
India-Pakistan: పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్ అగ్ర దౌత్యవేత్తకు భారత్ సమన్లు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది.
పాశవికంగా అమాయక పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదులకు సహకరిస్తున్న పాకిస్థాన్పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నవారిని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్కు గట్టి హెచ్చరిక జారీ చేసింది.
దీనితో పాటు ఆ దేశంతో ఉన్న దౌత్య సంబంధాల పరంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.
వివరాలు
'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటిస్తూ అధికారిక నోటీసు
ఈ పరిణామాల నేపథ్యంలో దిల్లీలోని పాకిస్థాన్ దౌత్యవేత్తకు కేంద్ర ప్రభుత్వం తాజా సమన్లు జారీ చేసింది.
బుధవారం అర్ధరాత్రి తర్వాత, పాక్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్కు ఈ సమన్లు పంపినట్టు సమాచారం.
ఆయనను వ్యక్తిగతంగా పిలిపించి, పాకిస్థాన్ మిలిటరీ దౌత్యవేత్తలను 'పర్సోనా నాన్ గ్రాటా'గా (అయిష్ట వ్యక్తులుగా) ప్రకటిస్తూ అధికారిక నోటీసు అందించామని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రకారంగా, ఆ దౌత్యవేత్తలు ఏకంగా వారం రోజుల వ్యవధిలోగా భారత్ను విడిచి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.