
YS Jagan: దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు.. ప్రధానికి వైఎస్ జగన్ లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ఎన్నికల నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ(డీలిమిటేషన్)పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇందులో దక్షిణాది రాష్ట్రాల నియోజకవర్గాల సంఖ్యలో ఎలాంటి తగ్గింపు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన 2026లో జరగనున్న డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సంఖ్యను మారుస్తే, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందనే భయంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 15ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువగా పెరిగిన కారణంగా, అక్కడి పార్లమెంటరీ సీట్లు తగ్గించే అవకాశముంది. గతంలో కేంద్రం జనాభా నియంత్రణకు పిలుపునివ్వడంతో ఆ రాష్ట్రాలు అందుకు అనుగుణంగా వ్యవహరించాయి.
Details
సమాన ప్రాతినిధ్యం అవసరం
పార్లమెంటరీ విధాన నిర్ణయాల్లో అన్ని రాష్ట్రాలకు సమాన హక్కు కల్పించేలా ఉండాలని వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమతుల్యత ఉండాలంటే, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గకుండా చూడాలని ప్రధానిని కోరారు. ఇదే జరిగితే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం లభిస్తుందని వైఎస్ జగన్ తెలిపారు. న్యాయమైన డీలిమిటేషన్కు విజ్ఞప్తి ఈ అంశాన్ని సమగ్రంగా పరిగణించి, ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం దక్షిణాదికి అన్యాయం కాకుండా చూడాలని వైఎస్ జగన్ మోదీని కోరారు. డీలిమిటేషన్ ప్రక్రియను జనాభా లెక్కల ఆధారంగా కాకుండా, పార్లమెంటరీ భాగస్వామ్యం సమతుల్యతను కాపాడే విధంగా చేపట్టాలని లేఖలో స్పష్టం చేశారు.