Ashwini Vaishnaw: స్టార్లింక్ కు స్వాగతమంటూ అశ్విని వైష్ణవ్ పోస్ట్ .. కాసేపటికే డిలీట్
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ (Starlink) శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు స్వాగతం అంటూ ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక పోస్ట్ చేశారు.
మారుమూల ప్రాంతాల్లో, ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టుల కనెక్టివిటీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో స్టార్లింక్ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి ప్రస్తావించారు.
అయితే, కొద్దిసేపటికే ఈ ట్వీట్ను తొలగించడం గమనార్హం.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ స్టార్లింక్ గురించి సోషల్ మీడియాలో స్పందిస్తూ -"భారతదేశంలో స్టార్లింక్కు స్వాగతం! మారుమూల ప్రాంతాల రైల్వే ప్రాజెక్టులకు ఇది చాలా ఉపయోగపడుతుంది" అని పేర్కొన్నారు.
వివరాలు
మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ విస్తరణ
ఇప్పటికే దేశంలోని దిగ్గజ టెలికాం కంపెనీలు అయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, తమ సేవలను విస్తరించడానికి స్టార్లింక్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.
దీంతో, మంత్రి చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. కానీ, కొద్ది సమయంలోనే ఆ ట్వీట్ ఎక్స్ ఖాతా నుండి తొలగించబడింది. అయితే, దీని వెనుక ఉన్న కారణాలు స్పష్టంగా తెలియరాలేదు.
లో ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహ సాంకేతికతను ఉపయోగించి, స్టార్లింక్ మారుమూల ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సాంకేతికత ద్వారా రైల్వే కార్యకలాపాలు మెరుగుపడతాయి, డిజిటల్ మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి, ఇంకా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మద్దతుగా నిలుస్తుంది.
వివరాలు
ప్రభుత్వ షరతులకు స్టార్లింక్ అంగీకారం
తాజాగా, జియో & ఎయిర్టెల్ వంటి టెలికాం కంపెనీలు స్టార్లింక్తో కుదుర్చుకున్న భాగస్వామ్యాలు టెలికాం రంగంలో కొత్త మార్పులను సూచిస్తున్నాయి.
ఒకప్పడు స్టార్లింక్ ప్రవేశానికి వ్యతిరేకంగా ఉన్న కంపెనీలు, ఇప్పుడు అదే సంస్థతో చేపట్టిన భాగస్వామ్యం భారతదేశ డిజిటల్ ఎకోసిస్టమ్లో పెద్ద పరిణామం అని నిపుణులు భావిస్తున్నారు.
భారతదేశంలో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించేందుకు అవసరమైన షరతులను స్టార్లింక్ అధికారికంగా అంగీకరించింది.
ఈ సేవలను ప్రారంభించడానికి భారత ప్రభుత్వం విధించిన నియమాలను పాటిస్తామని సంస్థ ప్రకటించింది.
స్టార్లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఇదొక కీలక ముందడుగు అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
యూజర్ డేటా భద్రత.. నియంత్రణ
భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, స్టార్లింక్ సేవల ద్వారా సేకరించే మొత్తం యూజర్ డేటాను దేశంలోనే నిల్వ చేయాలి.
అలాగే, అవసరమైనప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో ఈ సమాచారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది.
అయితే, టెలికమ్యూనికేషన్స్ విభాగానికి (DoT) ఇటీవల రాసిన లేఖలో, స్టార్లింక్ కొన్ని షరతులను సడలించాలని అభ్యర్థించింది.
దరఖాస్తు ఆమోదం పొందిన తరువాత, కాలక్రమేణా ఈ షరతులను అనుసరిస్తామని స్పష్టం చేసింది. అయితే, దీనిపై ప్రభుత్వ తుది నిర్ణయం కీలకంగా మారనుంది.