IT Raids : హైదరాబాద్లో ఐటీ కలకలం.. పారిజాత సహా కాంగ్రెస్ నేతల ఇళ్లపై సోదాలు
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ హైదరాబాద్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి మహానగర పరిసర ప్రాంతాల్లో ఐటీ అధికారులు కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సుమారు 10 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.కాంగ్రెస్ నేత చిగురింత పారిజాతకి చెందిన బాలాపూర్ నివాసంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. బడంగ్ పేట్ మేయర్ గా ఉన్న పారిజాత, కాంగ్రెస్ నుంచి మహేశ్వరం టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. మరోవైపు శంషాబాద్ సమీపంలోని కాంగ్రెస్ మహేశ్వరం అభ్యర్థి కేఎల్ఆర్ నివాసంలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఏకకాలంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చిగురింత తిరుపతిలో, ఆమె భర్త నర్సిహారెడ్డి దిల్లీలో ఉన్నట్లు సమాచారం.
ఐటీ శాఖకు సమాచారం రావడంతోనే సోదాలు
ఈ క్రమంలోనే పారిజాత, నర్సింహారెడ్డి కుటుంబీకులు, బంధువుల ఇళ్లలోనూ దాదాపు 10 నుంచి 15 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలాపూర్ లడ్డూను వేలంలో దక్కించుకున్న వంగటే లక్ష్మారెడ్డి ఇంట్లోనూ సోదాలు జరగడం గమనార్హం. అనధికారికంగా డబ్బు, నగలు భారీగా ఉన్నట్లు ఐటీ శాఖకు సమాచారం అందడంతోనే ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నాయకుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రూ.10 కోట్లు, 5 ఎకరాల స్థలం అందినట్లు పార్టీ నుంచి సస్పెండ్ అయిన కొత్త మనోహర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయడం కొసమెరుపు.