
Line Of Control:జమ్ముకశ్మీర్లోని ఉరి సెక్టార్ నియంత్రణ రేఖ వద్ద కాల్పులు.. భారత జవాను మృతి
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్లోని ఉరి సెక్టార్ సమీపంలో ఈరోజు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నియంత్రణ రేఖ (Line of Control) వద్ద జరిగిన ఈ కాల్పుల్లో ఓ భారత సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. భారత, పాకిస్థాన్ సైనిక దళాలు పరస్పరం కాల్పులు జరిపాయి. చొరబాటు ప్రయత్నాన్ని అడ్డుకునే క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఆర్మీ వర్గాల సమాచారం ప్రకారం, ఆగస్టు 12వ తేదీ రాత్రి కొందరు సాయుధులు చొరబడేందుకు ప్రయత్నించారు. అయితే ఈ చొరబాటు సాధారణ పద్ధతికి భిన్నంగా జరిగిందని అధికారులు చెబుతున్నారు. చొరబాటుదారులకు అండగా పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరిపినట్లు కూడా తెలుస్తోంది.
వివరాలు
ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది
ఈ ప్రయత్నంలో పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (BAT) కీలకంగా వ్యవహరించినట్టు స్పష్టమైంది. చొరబాటు జరుగుతున్న సమయంలో ఎదురుకాల్పులు చెలరేగాయి. ఆ కాల్పుల్లో గాయపడిన భారత జవాను తరువాత మృతిచెందాడు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా చొరబాటుదారులు ఆ పరిస్థితిని ఆసరాగా తీసుకుని తప్పించుకున్నారని సమాచారం. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది.