Page Loader
Bengaluru: SBIలో కన్నడ భాషా వివాదం.. స్పందించిన సీఎం సిద్ధరామయ్య 

Bengaluru: SBIలో కన్నడ భాషా వివాదం.. స్పందించిన సీఎం సిద్ధరామయ్య 

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2025
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో చోటుచేసుకున్న కన్నడ భాషా వివాదం నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. కస్టమర్లతో అనుచితంగా వ్యవహరించిన ఎస్‌బీఐ మేనేజర్ తీరును ఆయన తప్పుబట్టారు. స్థానిక భాష అయిన కన్నడకు ప్రతి ఉద్యోగి గౌరవం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి, కస్టమర్లతో సంభాషించే సమయంలో స్థానిక భాషలోనే మాట్లాడే ప్రయత్నం చేయాలని సూచించారు. బెంగళూరులోని సూర్యనగర బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఎస్‌బీఐ మేనేజర్ ఒకరు, కన్నడలో మాట్లాడాలని కోరిన కస్టమర్‌తో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఎస్‌బీఐ అధికారులు ఆ మేనేజర్‌ను బదిలీ చేశారు. ఈ చర్యతో సమస్య తాత్కాలికంగా పరిష్కారమైనట్లు భావిస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య అన్నారు.

వివరాలు 

అసలేమయ్యిందంటే..? 

ఈ తరహా ఘటనలు మళ్లీ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల సిబ్బందికి ఆయా ప్రాంతాల్లోని భాషలు, సంస్కృతులు గురించి అవగాహన కల్పించే విధంగా శిక్షణ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగాన్ని కోరారు. ఇలాంటి భాషా వివాదాలు సమాజంలో ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశముందని కూడా ఆయన హెచ్చరించారు. బెంగళూరులోని సూర్యనగరలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఒక కస్టమర్‌ మేనేజర్‌ను కన్నడలో మాట్లాడాలని కోరారు. దీనిపై మేనేజర్ అసహనంగా స్పందిస్తూ, "కన్నడలోనే తప్పనిసరిగా మాట్లాడాల్సిన నియమం ఏదైనా ఉందా?" అని ప్రశ్నించారు. అంతేకాదు, తాను ఎప్పుడూ కన్నడలో మాట్లాడబోనని, "ఏం చేసుకుంటారో చేసుకోండి" అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

వివరాలు 

భారతీయ భాషల గౌరవానికి సంఘాలు ఆందోళన 

ఈ మాటలు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వ్యాపించడంతో తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ ఘటనపై నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపడుతూ, ఎస్‌బీఐ సిబ్బంది ఇతర ప్రాంతాల్లోనూ కస్టమర్లను అవమానపర్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై కర్ణాటకలోని పలు భాషా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా 'కర్ణాటక రక్షణ వేదికే' (కేఆర్‌వీ) సంఘం ఈ వ్యవహారంపై గట్టిగా స్పందించింది. మేనేజర్‌ తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నిరసనలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఎస్‌బీఐ ఉద్యోగులు కస్టమర్లను తరచూ అవమానపరుస్తున్నారని, అలాగే స్థానిక భాషలో సేవలు అందించడంలో బ్యాంకు విఫలమవుతోందని ఆరోపించింది.