KCR: కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే అనర్హత విధించాలి : హైకోర్టులో ఫిర్యాదు
ఈ వార్తాకథనం ఏంటి
కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫార్మర్స్ ఫెడరేషన్కు చెందిన విజయ్ పాల్ రెడ్డి ఈ పిటిషన్ను దాఖలు చేశారు.
అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ అభ్యర్థించారు. పిటిషన్లో కేసీఆర్ బదులుగా మరొకరిని నియమించాలని సూచించారు.
ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రజల హక్కుల కోసం పోరాడాలని, కానీ అసెంబ్లీకి రాకుంటే ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని అభిప్రాయపడ్డారు.
2023 డిసెంబర్ 16న ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాలేదని పిటిషన్లో పేర్కొన్నారు.
స్పీకర్ లేదా స్పీకర్ కార్యాలయం దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ వాదించారు.
Details
ఇలాంటి పిటిషన్ రావడం ఇదే తొలిసారి
ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు ఎమ్మెల్యేలకు వేతనాలు పెంచినప్పటికీ, ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలు నిర్వహించలేని పరిస్థితిలో కేసీఆర్ను ఆ పదవి నుంచి తప్పించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కొత్త నాయకుడిని ఎంపిక చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
హైకోర్టు ముందు ఇలాంటి పిటిషన్ రావడం ఇదే తొలిసారని, శాసన వ్యవస్థలో తీసుకునే రాజకీయ, ఆర్థిక నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయవ్యవస్థకు ఉందని పిటిషన్లో ప్రస్తావించారు.
ప్రస్తుతం ఈ పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. ఈ కేసులో స్పీకర్, స్పీకర్ కార్యాలయం, కేసీఆర్, కేటీఆర్లను ప్రతివాదులుగా చేర్చారు.