కేరళ: భారత తొలి 'వాటర్ మెట్రో'ను ప్రారంభించిన మోదీ; టికెట్ ధర ఎంతంటే!
కేరళలోని కొచ్చిలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దేశంలో మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రారంభించారు. 10ద్వీపాలను కలిపే వాటర్ మెట్రో ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లతో నడుస్తుంది. కేరళ సీఎం పినరయి విజయన్ 'డ్రీమ్ ప్రాజెక్ట్'గా చెప్పుకునే ఈ మెట్రోను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. వాటర్ మెట్రో అందుబాటులోకి వస్తే కొచ్చి అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. ఇది రవాణా, పర్యాటక రంగాల వృద్ధికి కూడా దోహదపడుతుందని అభిప్రాయపడుతోంది. వాటర్ మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణానికి కేరళ ప్రభుత్వం, జర్మన్ ప్రమోషనల్ బ్యాంక్ కేఎఫ్డబ్ల్యూ నిధులు సమకూర్చాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టును కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ రూ. 1,137 కోట్లతో నిర్మించింది.
రూ. 20తో టికెట్ ధరలు ప్రారంభం
అంతేకాకుండా మెట్రో పోర్ట్ సిటీ కొచ్చిలో చుట్టుపక్కల ఉన్న 10 దీవులను కలుపుతుంది. ఎనిమిది ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లతో వాటర్ మెట్రో ప్రారంభమైంది. ప్రాజెక్ట్లో 78 ఎలక్ట్రిక్ బోట్లు, 38 టెర్మినల్స్ ఉన్నాయి. ప్రయాణికులు 'కొచ్చి వన్' కార్డును ఉపయోగించి వాటర్ మెట్రో ద్వారా ప్రయాణించవచ్చు. 'కొచ్చి వన్' యాప్ని ఉపయోగించి ఆన్లైన్లో కూడా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. రూ. 20తో టికెట్ ధరలు ప్రారంభం అవుతాయి. అదనంగా, సాధారణ ప్రయాణీకులకు వారంవారీ, నెలవారీ పాస్లు ఉంటాయి. మొదటి దశలో హైకోర్టు-వైపిన్ టెర్మినల్స్ నుంచి వైట్టిల-కక్కనాడ్ టెర్మినల్స్ వరకు సేవలు ప్రారంభమయ్యాయి. పౌరులు హైకోర్టు టెర్మినల్ నుంచి వాటర్ మెట్రో ద్వారా 20 నిమిషాల్లో వైపిన్ టెర్మినల్కు చేరుకోవచ్చు.