
Telangana Formation : కేసీఆర్ అమరణదీక్ష ప్రకటన నుంచి.. కేంద్రం గెజిట్ ఇచ్చే వరకు కీలక ఘట్టాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నాంది పలికిన ఆకాంక్ష... ఎంతోమందిని ఉద్యమంలోకి నెట్టింది.
ఈ ఆశయమే ఉద్యమానికి బలాన్ని ఇచ్చింది. యువతలో ఉత్తేజం నింపింది.
ఆలోచనల స్థాయిని దాటి... గట్టిగా నిలిచే ఉద్యమంగా మారింది.
విద్యార్థుల పోరాటం, అమరవీరుల త్యాగంతో... పాతికేళ్ళగా కొనసాగిన కల నిజమైంది.
2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు, ఆ చారిత్రక రోజు పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ, పదకొండవ వసంతంలోకి ప్రవేశిస్తోంది.
వివరాలు
2009 తర్వాత మళ్లీ ఉద్యమ బాట
1969లో ప్రారంభమైన తొలి ఉద్యమం విఫలమైనా... 2009లో కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షతో ఉద్యమం మళ్లీ ఉధృతమైంది. ఆ తరువాత వెనుతిరిగి చూడకుండా ప్రజలు తమ లక్ష్యం వైపు సాగారు. ప్రతి కీలక ఘట్టంలో ప్రజల భాగస్వామ్యం స్పష్టంగా కనిపించింది.ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన అనేక సంఘటనలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇవి నేడు కాదు... రేపటి తరాలకు సైతం ప్రేరణగా నిలుస్తాయి.
ప్రధాన ఘట్టాలు -మలుపులు
ఫ్రీజోన్ అంశం (2009): ఎన్నికల అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం,హైదరాబాద్ ప్రాంతాన్ని ఫ్రీజోన్గా ప్రకటించారు. దీంతో పోలీసు ఉద్యోగాల్లో స్థానిక రిజర్వేషన్లు తొలగిపోయాయి. ఇది ఉద్యమానికి మరింత బలం ఇచ్చింది. రాజకీయ పక్షాలు, యువత, ఉద్యోగ సంఘాలు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
వివరాలు
కీలక ఘట్టాలు ఇవే..
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉద్యోగులు భారీ సభ నిర్వహించారు.
టీఆర్ఎస్ నిరసన: సుప్రీంకోర్టు తీర్పు 610 జీవోకు విరుద్ధమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఫ్రీజోన్ వ్యతిరేకంగా బంద్, నిరసనలు జరిగాయి. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు దీక్ష చేపట్టగా, కేసీఆర్ సంఘీభావం తెలుపుతూ అక్కడకు వెళ్లారు. అక్కడే కీలక ప్రకటన చేశారు.
కేసీఆర్ దీక్ష (నవంబర్ 29, 2009): తెలంగాణ కోసం కేసీఆర్ నిరాహార దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు. "సచ్చుడో - తెలంగాణ వచ్చుడో" నినాదాన్ని విపులంగా ప్రచారం చేశారు. దీక్షాస్థలిగా సిద్ధిపేట సమీపంలోని రంగధాంపల్లిని ఎంపిక చేసుకున్నారు. పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
వివరాలు
కీలక ఘట్టాలు ఇవే..
కరీంనగర్ ప్రయాణం: నవంబర్ 26న హైదరాబాద్ నుంచి కరీంనగర్ బయలుదేరారు. దీక్షాస్థలికి వెళ్లే అవకాశం ఉందన్న వార్తలతో పోలీసులు అరెస్ట్కి సిద్ధమయ్యారు. కానీ కేసీఆర్ నేరుగా ఉత్తర తెలంగాణ భవనానికి వెళ్లి మూడు రోజులపాటు అక్కడే ఉన్నారు. నవంబర్ 29న పోలీసులు తెలంగాణ భవన్ను ముట్టడి చేశారు. భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. తోపులాట జరిగిన అనంతరం, కేసీఆర్ ను ఖమ్మం వైపు తీసుకెళ్లారు. తర్వాత ఖమ్మం కోర్టులో హాజరై 14 రోజుల రిమాండ్తో జైలుకు తరలించారు.
జైలులోనూ దీక్ష: కేసీఆర్ జైలులోనూ దీక్షను కొనసాగించారు. ఆయన అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం భగ్గుమంది. విద్యార్థులు రాస్తారోకోలు, బంద్లు చేపట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్రిక్తతకు కేరాఫ్గా మారింది.
వివరాలు
కీలక ఘట్టాలు ఇవే..
నవంబర్ 29న ఎల్బీనగర్లో శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకోవడం ఉద్యమానికి మరింత ఉదృతిని తీసుకొచ్చింది. డిసెంబర్ 3న చనిపోవడంతో ఉద్యమం మలుపు తిరిగింది.
కేంద్రం స్పందన: రాష్ట్ర పరిస్థితులపై కేంద్రం అంచనా వేసింది. కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తే రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశముందని గ్రహించి, డిసెంబర్ 9 అర్ధరాత్రి చిదంబరం ప్రకటన చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీంతో కేసీఆర్ దీక్షను విరమించారు. నిమ్మరసం తాగించి ప్రజా నేతలు దీక్షను ఆపించారు.
సీమాంధ్ర ప్రతిస్పందన: కేంద్ర ప్రకటనపై సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నాయకులు సమైక్యానికే మద్దతు పలికారు. సామూహిక రాజీనామాలతో ఉద్యమం మొదలుపెట్టారు. దీంతో తెలంగాణ ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడ్డాయి.
వివరాలు
కీలక ఘట్టాలు ఇవే..
డిసెంబర్ 23న చిదంబరం మరో ప్రకటన చేసి,అన్ని పక్షాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
జేఏసీ ఏర్పాటుతో ముందడుగు:చిదంబరం రెండో ప్రకటనపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ 48గంటల్లోగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కోదండరాం నేతృత్వంలో రాజకీయ జేఏసీ ఏర్పడింది. అన్ని ప్రజా సంఘాలు, పార్టీలతో కలిసి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు.
శ్రీకృష్ణ కమిటీ (2010): కేంద్రం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని నియమించింది. ఈ కమిటీ 9 నెలలపాటు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి అధ్యయనం చేసింది. 2010 డిసెంబర్ 30న ఆరుఎంపికలతో కూడిన నివేదిక సమర్పించింది. వాటిలో ఐదు తెలంగాణకు వ్యతిరేకంగా ఉండగా,ఒక ఎంపిక హైదరాబాద్తో కూడిన తెలంగాణకు అనుకూలంగా ఉండింది.
వివరాలు
కీలక ఘట్టాలు ఇవే..
టీఆర్ఎస్ ఈ నివేదికను తీవ్రంగా వ్యతిరేకించింది.
మిలియన్ మార్చ్ (2011): జేఏసీ పిలుపుతో మార్చి 10న ట్యాంక్బండ్ పై లక్షలాదిమంది మద్దతుతో మిలియన్ మార్చ్ జరిగింది.అయితే సాయంత్రం తర్వాత కొందరు విగ్రహాలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మీడియా వాహనాలపై దాడులు జరిగాయి. ఇది ఉద్యమ చరిత్రలో మైలురాయి ఘట్టంగా నిలిచింది.
సకలజనుల సమ్మె: 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు 42 రోజులపాటు సమ్మె కొనసాగింది. ఈ సమయంలో విద్యా, విద్యుత్,రవాణా,దేవాలయాల వరకు అన్నీ స్తంభించాయి.
సీడబ్ల్యూసీ ప్రకటన (2013): జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ హైదరాబాద్తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇవ్వాలని ప్రకటించింది. డిసెంబర్ 5న కేంద్ర మంత్రివర్గం తెలంగాణ ముసాయిదా బిల్లును ఆమోదించింది.
వివరాలు
కీలక ఘట్టాలు ఇవే..
అసెంబ్లీకి బిల్లు చేరిన తర్వాత సీమాంధ్ర ఎమ్మెల్యేలు ప్రతులను చించేశారు.శాసనసభ తిరస్కార తీర్మానం చేయగా కేంద్రానికి పంపారు.
చివరి దశ: ఫిబ్రవరి 7న కేంద్ర మంత్రివర్గం తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 14న లోక్సభలో ప్రవేశపెట్టగా,ఫిబ్రవరి 18న ఆమోదం పొందింది.అదే బిల్లు ఫిబ్రవరి 20న రాజ్యసభలో కూడా ఆమోదితమైంది.
రాష్ట్రపతి ఆమోదం:మార్చి 1న రాష్ట్రపతి బిల్లుకు సంతకం చేశారు.మార్చి 2న కేంద్ర గెజిట్ విడుదల అయ్యింది. మార్చి 4న జూన్ 2ను అపాయింటెడ్ డేగా ప్రకటించారు. ఈ మేరకు దేశ 29వ రాష్ట్రంగా తెలంగాణ 2014 జూన్ 2న అధికారికంగా ఏర్పడింది.
మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్: తెలంగాణలో జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.