Page Loader
Kishan Reddy: జ‌మిలి ఎన్నిక‌లపై కేంద్ర క‌మిటీ: కిషన్ రెడ్డి
జ‌మిలి ఎన్నిక‌లపై కేంద్ర క‌మిటీ: కిషన్ రెడ్డి

Kishan Reddy: జ‌మిలి ఎన్నిక‌లపై కేంద్ర క‌మిటీ: కిషన్ రెడ్డి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 19, 2024
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల అమలుకై ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన ప్రకటనలో, దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతున్న కారణంగా ఎన్నికల కోడ్ నిరంతరం అమల్లో ఉంటూ, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు ఆటంకం కలిగిస్తోందని అన్నారు. పలు సందర్భాల్లో సాధారణ నిర్ణయాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఉత్పన్నమవుతున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నదని, ఈ క్రమంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి జరపాలన్న నిర్ణయం తీసుకోవడం సానుకూలమైన పరిణామమని అభిప్రాయపడ్డారు.

వివరాలు 

 ఖజానాపై ఆర్థిక భారం 

ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభల వల్ల ట్రాఫిక్ జాంలు, శబ్ద కాలుష్యం వంటి సమస్యలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని మంత్రి వివరించారు. అలాగే, వేర్వేరు ఎన్నికల నిర్వహణ కారణంగా ఖజానాపై ఆర్థిక భారం పడుతోందని, వేర్వేరుగా పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరపడం వల్ల అయ్యే వ్యయం రూ.4,500 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిందని, ప్రస్తుతం వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు కూడా త్వరలోనే దీనికి సహకరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.