కేదార్నాథ్ యాత్రలో విషాదం.. కొండచరియలు విరిగిపడి 12 మందికిపైగా గల్లంతు
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ కేదార్నాథ్ యాత్ర మార్గంలో కొండచరియలు భారీగా విరిగిపడి 12 మందికిపైగా గల్లంతయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు శుక్రవారం దాత్ పులియాలో కొండచరియలు విరిగిపడ్డాయి. రుద్రప్రయాగ్ జిల్లాలోని గౌరీకుండ్ సమీపంలోని యాత్ర మార్గంలో మందాకిని నదిలో మూడు దుకాణాలు కొట్టుకుపోయాయి. ఓ వైపు వరదలు, మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 12 మందికిపైగా దుకాణదారులు గల్లంతయ్యారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో NDRF, SDRF సహా పోలీసులతో కలిసి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ సచివాలయంలోని విపత్తు నిర్వహణ కేంద్రంలో వరదలపై సమీక్ష నిర్వహిస్తున్నారు.