Madhu yashki Goud: మధుయాష్కీ ఇంట్లో పోలీసుల సోదాలు.. ఎల్బీ నగర్లో ఉద్రిక్తత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం ఊపందుకుంది. ప్రచారంలో అభ్యర్థులు డబ్బులు పంచుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ ఇంటిలో మంగళవారం అర్థరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డబ్బులు పంచుతున్నారన్న సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లాలోని హయత్నగర్లో మధుయాష్కీ నివాసంలో దాడులు చేశారు. పోలీసుల సోదాలపై మధుయాష్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుకున్నారు. అంతేకాకుండా, అర్ధరాత్రి సోదాల పేరుతో తన కుటుంబ సభ్యులను పోలీసులు భయపెడుతున్నారని మధుయాష్కీ మండిప్డడారు. విషయం తెలిసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు మధుయాష్కీ నివాసం వద్దకు చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అర్థరాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.