Grenade Attack: అమృత్సర్ ఆలయంపై గ్రెనేడ్ దాడి.. పోలీసు ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అమృత్సర్లోని ఓ ఆలయంపై ఇటీవల జరిగిన గ్రెనేడ్ దాడి ఘటనలో ప్రధాన నిందితుడు సోమవారం మరణించాడు.
గుర్సిదక్ సింగ్ అనే అనుమానితుడు పంజాబ్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు, అయితే మరో నిందితుడు తప్పించుకున్నాడు.
అమృత్సర్లోని ఒక గుడిపై గ్రెనేడ్ దాడి జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి హ్యాండ్ గ్రెనేడ్ విసిరినట్లు సమాచారం.
పేలుడు కారణంగా ఆలయ గోడ స్వల్పంగా ధ్వంసమైంది. అర్థరాత్రి జరిగిన ఈ ఘటనను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
నిఘా వర్గాల సమాచారంతో నిందితులు రాజసాన్సీ ప్రాంతంలో తిరుగుతున్నట్లు తెలిసింది. దాంతో, సీఐఏ, ఛెహర్తా పోలీసుల బృందం అక్కడ గాలింపు చర్యలు ప్రారంభించింది.
వివరాలు
పోలీసులపై నిందితులు కాల్పులు
సోమవారం తెల్లవారుజామున, గుర్సిదక్ సింగ్, విశాల్ అనే ఇద్దరు నిందితులు పోలీసులకు ఎదురయ్యారు.
వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, నిందితులు తమ వాహనాన్ని వదిలేసి పోలీసులపై కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ గురుప్రీత్ సింగ్ ఎడమ చేతికి, ఇన్స్పెక్టర్ అమోలక్ సింగ్కు గాయాలయ్యాయి.
ఆత్మరక్షణలో భాగంగా ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ ఎదురుగా కాల్పులు జరపగా, గుర్సిదక్ గాయపడ్డాడు.
గాయపడిన అధికారులతో పాటు అతడిని సివిల్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.
అయితే, అతని సహచరుడు విశాల్ పరారైపోయాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.