Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై సీఎం సంచలన నిర్ణయం.. రాయదుర్గం-శంషాబాద్ ప్రాజెక్టు నిలిపివేత
హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు మార్గాల విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం మెట్రోపై సమీక్ష చేసిన సీఎం, ఎయిర్పోర్టు మెట్రోపై ఆరా తీశారు. ఓఆర్ఆర్ వెంట జీఓ 111 ప్రాంతంలో మెట్రో ఎలైన్మెంట్ను రూపొందించడంపై అధికారులను నిలదీశారు. ఇప్పటికే అక్కడ ఓఆర్ఆర్ ఉన్న నేపథ్యంలో రాయదుర్గం-శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించాల్సిన మెట్రో టెండర్లను నిలిపివేయాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా ఎంజీబీఎస్-ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట, ఎయిర్పోర్టు మీదుగా ఎలైన్మెంట్ రూపొందించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా రెండు మార్గాలను పరిశీలించాలని సూచించారు. చాంద్రాయణగుట్ట, మైలార్దేవ్పల్లి, జల్పల్లి, విమానాశ్రయం పీ7 రోడ్డు ఒక మార్గం ఒకటి. మరోటి చాంద్రాయణగుట్ట, బార్కాస్, పహాడీషరీఫ్, శ్రీశైలం రోడ్డు మార్గాన్నీ అధ్యయనం చేయాలని సూచించారు.
ఖర్చు తక్కువ ఉన్న రూట్ చూడాల్సిందే
అయితే ఇందులో ఏదీ తక్కువ ఖర్చు అయితే దానికే ప్రాధాన్యం ఇవ్వాలని, ఫలితంగా కొత్త మార్గం సిద్ధం చేయాలని సూచించారు. దీంతో తూర్పు, మధ్య, పాత నగరంలోని అధిక జనాభాకు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు మెట్రో లైను నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలైన్మెంట్ను ఖరారు చేసి టెండర్లను సైతం ఆహ్వానించింది. ఈ లైనుకు దాదాపు రూ.6,250 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ మార్గానికి హెచ్ఎండీఏ నుంచి రూ.600 కోట్లు ఇస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సందర్భంగా మెట్రో లైన్ విషయంలో సర్కారు మార్పు నిర్ణయం తీసుకుంది.
ఓఆర్ఆర్ ఉంది కనుక మెట్రో అవసరం లేదు : సీఎం రేవంత్
శంషాబాద్ నుంచి విమానాశ్రయానికి ఓఆర్ఆర్ ఉండటంతో ఈ కారిడార్లో మెట్రో లైను అవసరం లేదని సీఎం రేవంత్ భావిస్తున్నారు. పాతబస్తీ మెట్రో లేమిపై అసంతృప్తి మెట్రో మొదటి దశలో ఒప్పందం మేరకు పాతబస్తీలోని MGBS నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల మార్గాన్ని L&Tతో పాటు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ పూర్తి చేయకపోవడంపై సీఎం అసంతృప్తి వెలిబుచ్చారు. ఈ మేరకు విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విమానాశ్రయం మెట్రోపైనా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలన్నారు. మూసీ కారిడార్లో నాగోలు నుంచి గండిపేట వరకు ఎంజీబీఎస్ను కలుపుతూ ఈస్ట్, వెస్ట్ రోడ్డు కమ్ మెట్రో రైలును మాస్టర్ ప్లాన్లో చేర్చాలని సూచించారు.
మెగా టౌన్షిప్ ఏర్పాటుకు ప్లాన్ రెఢీ చేయాల్సిందే :
మహానగరానికి దూరంగా కందుకూరు సమీపంలో పార్మా సిటీ కోసం సేకరించిన భూమిలో పర్యావరణహిత మెగా టౌన్షిప్ ఏర్పాటుకు ప్లాన్ రెఢీ చేయాలని సీఎం సూచించారు. విమానాశ్రయం నుంచి శ్రీశైలం రోడ్డులోని తుక్కుగూడ మీదుగా కందుకూరు మెగా సిటీకి మెట్రోను అనుసంధానించాలన్నారు. భౌగోళిక పరిమితులు లేని ప్రపంచనగరంగా ఎదిగేందుకు హైదరాబాద్కు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 40 శాతం పట్టణీకరణ ఉందని, వేగంగా పట్టణీకరణ దృష్ట్యా ఓఆర్ఆర్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేయాలన్నారు. భవిష్యత్'లో 2-3 కోట్ల జనాభా నివసించేందుకు అనుగుణంగా ప్రణాళికలకు రూపకల్పన చేయాలన్నారు. సమీక్షలో డీసీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, సీఎస్ శాంతికుమారి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి,అరవింద్కుమార్, సీఎంఓ కార్యదర్శి వి.శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.