
Puja Khedkar: డ్రైవర్ కిడ్నాప్.. మరో కేసులో తెరపైకి పూజా ఖేడ్కర్ పేరు
ఈ వార్తాకథనం ఏంటి
యూపీఎస్సీకి తప్పుడు పత్రాలు సమర్పించటం ద్వారా ఐఏఎస్ ఉద్యోగం కోల్పోయిన పూజా ఖేద్కర్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. తాజాగా, ఓ ట్రక్ డ్రైవర్ను బలవంతంగా తీసుకెళ్లిన కేసులో ఆమె పేరు మళ్లీ బయటకు వచ్చింది. ముంబైలోని ఎరోలీ సిగ్నల్ ప్రాంతంలో కాంక్రీట్ మిక్సర్ ట్రక్ ఒక కారును ఢీ కొట్టింది. ఆ ట్రక్ను ప్రహ్లాద్కుమార్ అనే వ్యక్తి నడిపించేవాడు.ఈ ప్రమాదం వెంటనే,ప్రహ్లాద్ను ఇద్దరు వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. దర్యాప్తు అనంతరం,డ్రైవర్ ప్రస్తుతం పుణేలోని చతుశృంగి ప్రాంతంలో ఉన్నట్లు వెల్లడైంది. అతడిని వెతకడానికి పోలీసులు పూజా ఖేడ్కర్ ఇంటికి వెళ్లినప్పుడు,ఆమె తల్లిదండ్రుల నుండి సమస్యలు ఎదురయ్యాయని పేర్కొన్నారు.
వివరాలు
ట్రైనీ సహాయ కలెక్టర్గా.. పూజా ఖేడ్కర్ అధికార దుర్వినియోగం
మనోరమ ఖేడ్కర్ తమ విధులకు ఆటంకం కలిగించిందన్నారు. దీంతో , ఆమెకు సమన్లు జారీ చేసి, తదుపరి విచారణ కోసం పోలీస్ స్టేషన్కు హాజరుకావాలని సూచించారు. ఇక పుణేలో ట్రైనీ సహాయ కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్పై అధికార దుర్వినియోగం,యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ, ఆమెను ముస్సోరిలోని లాల్బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీలో తిరిగి హాజరు కావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షను రాయడం గుర్తించిన యూపీఎస్సీ, దీనిపై వివరణ ఇవ్వాలని ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
వివరాలు
ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
తనపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతో, పూజా ఖేడ్కర్ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఏ పత్రాలను ఫోర్జరీ చేయలేదని, యూపీఎస్సీకి తనపై అనర్హత విధించే అధికారమేమీ లేదని ఆమె వాదించారు. అయినప్పటికీ, ఆమెకు నిరాశే ఎదురైంది. గతేడాది ఆగస్టులో ఆమె ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం మధ్యంతర రక్షణ కల్పించింది. తరువాత సుప్రీంకోర్టు విచారణలో, ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.