MLC Elections 2025: నేడు ఎమ్మెల్సీ ఎన్నికలకు నాగబాబు నామినేషన్
ఈ వార్తాకథనం ఏంటి
ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
కూటమి పార్టీల సమాఖ్యలో భాగంగా జనసేన అభ్యర్థిగా ఆయన శుక్రవారం ఉదయం నామినేషన్ వేయనున్నారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, నామినేషన్కు అవసరమైన అన్ని పత్రాలను పార్టీ కార్యాలయం ఇప్పటికే సిద్ధం చేసింది.
కొణిదెల నాగబాబు అభ్యర్థిత్వానికి మద్దతుగా జనసేన పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం తమ సంతకాలు చేశారు.
ఈ ప్రక్రియకు మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా బాధ్యత తీసుకున్నారు.
వివరాలు
ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు మార్చి 10 చివరి తేది
ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, ఆరణి శ్రీనివాసులు, లోకం నాగ మాధవి, పంచకర్ల రమేష్ బాబు, పత్సమట్ల ధర్మరాజు, సుందరపు విజయ్ కుమార్, అరవ శ్రీధర్, పంతం నానాజీ, బత్తుల బలరామకృష్ణలు సంతకాలు చేశారు. అలాగే, మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా స్వయంగా సంతకం చేశారు.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు మార్చి 10 చివరి తేది.
ప్రభుత్వ సెలవులు మినహాయించి, మిగిలిన ఏ రోజైనా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య శాసనసభ భవనంలో నామినేషన్లను స్వీకరించనున్నారు.
మార్చి 11న ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది, అలాగే మార్చి 13న మధ్యాహ్నం 3 గంటలలోపు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.