
Telangana: తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే
ఈ వార్తాకథనం ఏంటి
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోనూ పలు రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందుతున్నాయి.
ఈ నేపథ్యంలో మే 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో తెలంగాణలోని మూడు రైల్వే స్టేషన్లను పునః ప్రారంభించనున్నారు.
వివరాలు
దేశవ్యాప్తంగా 102 స్టేషన్ల పునః ప్రారంభం
భారతదేశం మొత్తంలో 102రైల్వేస్టేషన్లను ఒకేసారి పునః ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.
ఇందులో తెలంగాణకు చెందిన మూడు స్టేషన్లూ ఉన్నాయి. బేగంపేట,వరంగల్,కరీంనగర్ రైల్వే స్టేషన్లను మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు.
ఈ మూడు స్టేషన్లు అత్యాధునిక సౌకర్యాలతో, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతులతో తీర్చిదిద్దారు.
బేగంపేట రైల్వే స్టేషన్ - 26.55 కోట్లతో ఆధునీకరణ
బేగంపేట రైల్వే స్టేషన్ను 26.55 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేశారు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణ పనులు పూర్తయ్యాయి.కొత్తగా నిర్మించిన స్టేషన్ భవనం,12 మీటర్ల వెడల్పుగల ఫుట్ ఓవర్ బ్రిడ్జి,ప్లాట్ఫాం షెల్టర్లు,లిఫ్టులు,ఎస్కలేటర్లు,సరికొత్త వెయిటింగ్ హాల్,టాయిలెట్లు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
ప్రయాణికుల అనుభూతిని మెరుగుపరచే విధంగా ప్రతి కోణంలోను సౌకర్యాలను సమకూర్చారు.
వివరాలు
వరంగల్ స్టేషన్ - విమానాశ్రయ తరహాలో అభివృద్ధి
వరంగల్ రైల్వే స్టేషన్ను ఎయిర్పోర్ట్ తరహాలో ఆధునీకరించారు. ఈ ప్రాజెక్ట్కు రూ. 25.41 కోట్లు వెచ్చించారు.
ఈ ఆధునీకరణలో భాగంగా విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ర్యాంపులు నిర్మించారు.
పచ్చదనం కోసం ల్యాండ్స్కేపింగ్ చేపట్టారు. ఆధునిక ఆహారశాలలు, వాణిజ్య సముదాయాలు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నిర్మించారు.
మొత్తం స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయి, అత్యాధునిక హంగులతో మెరిసిపోతుంది.
వివరాలు
కరీంనగర్ రైల్వే స్టేషన్ - కార్పోరేట్ మాదిరిగా తీర్చిదిద్దిన మోడల్
కరీంనగర్ రైల్వే స్టేషన్ను రూ. 30 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునికంగా తీర్చిదిద్దారు.
2023 ఆగస్టులో ప్రారంభమైన ఈ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఇప్పుడు స్టేషన్ పూర్తిగా సిద్దమైంది. స్టేషన్లో కార్పొరేట్ స్థాయిలో ఏసీ వెయిటింగ్ హాల్స్ నిర్మించారు.
సీసీటీవీ కెమెరాలతో మొత్తం స్టేషన్ను నిఘాలో ఉంచారు. పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. స్టేషన్ పరిసరాలను శుభ్రంగా,ఆకర్షణీయంగా ఉంచారు.
ఇక్కడ ఏర్పాటు చేసిన మౌలిక వసతుల్లో 6 బుకింగ్ కౌంటర్లతో పాటు వికలాంగులకు ప్రత్యేక బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేశారు.
12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రెండు ఎస్కలేటర్లు, స్టేషన్ ముందు పార్క్, అర్థవంతమైన సైన్ బోర్డులు, వెయిటింగ్ హాల్లు ఏర్పాటు చేశారు.
వివరాలు
మొత్తంగా అభివృద్ధి దిశగా రైల్వే స్టేషన్లు
ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లు వర్చువల్ పద్ధతిలో ప్రారంభించబడతాయి.
రాష్ట్రంలో మిగిలిన 37 స్టేషన్ల అభివృద్ధి పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో తెలంగాణ ముఖ్య పాత్ర పోషిస్తోంది.