
Manipur: కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు 44మంది ఎమ్మెల్యేలు సిద్ధం.. రాజ్ భవన్లో గవర్నర్ను కలిసిన మణిపూర్ బీజేపీ నేత
ఈ వార్తాకథనం ఏంటి
వర్గ పోరాటాలతో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మణిపూర్లో త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని బీజేపీ నేత తోక్చం రాధేశ్యామ్ సింగ్ వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను రాజ్భవన్లో కలిసి, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు.
బీజేపీకి చెందిన మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా ఆయనతో కలిసి గవర్నర్ను కలిశారు.
రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మొత్తం 44 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని రాధేశ్యామ్ స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని అధికారికంగా గవర్నర్కు సమర్పించినట్లు తెలిపారు.
ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రంలో ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న విషయం తెలిసిందే.
వివరాలు
వ్యక్తిగతంగా 44 మంది ఎమ్మెల్యేలను కలిసిన స్పీకర్ సత్యబ్రత
కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న విషయంపై తుది నిర్ణయం బీజేపీ కేంద్ర నాయకత్వం తీసుకుంటుందని రాధేశ్యామ్ అన్నారు.
అసెంబ్లీ స్పీకర్ సత్యబ్రత వ్యక్తిగతంగా 44 మంది ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడినట్టు సమాచారం.
కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఎవరి నుంచి విరోధం లేదని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.
రెండు సంవత్సరాలు కరోనా వల్ల ప్రభావితమైపోయాయని, తర్వాతి రెండు సంవత్సరాలు వర్గీయ హింస వల్ల రాష్ట్రం అస్థిరతకు గురైందని వివరించారు.
మైతేలు, కుకీల మధ్య ఘర్షణలు తీవ్రమవడంతో అప్పటి సీఎం అయిన బీజేపీకి చెందిన ఎన్. బిరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.
వివరాలు
మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 మంది ఎమ్మెల్యేలు
రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలను అదుపులోకి తేవడంలో విఫలమయ్యారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఒక ఎమ్మెల్యే మృతిచెందిన కారణంగా ప్రస్తుతం 59 మంది మాత్రమే ఉన్నారు.
బీజేపీ కూటమిలో 32 మంది మైతే తెగకు చెందిన ఎమ్మెల్యేలు, ముగ్గురు మణిపురి ముస్లింలు, 9 మంది నాగ వర్గ ఎమ్మెల్యేలు ఉన్నారు.
వీరి మొత్తం సంఖ్య 44. ఇక కాంగ్రెస్ పార్టీలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా మైతే తెగకు చెందినవారే.