
Extradition: భారత్ కు 26/11 మాస్టర్మైండ్ తహవ్వూర్ రానా..ఢిల్లీ, ముంబై జైళ్లలో ఏర్పాట్లు?
ఈ వార్తాకథనం ఏంటి
2008లో ముంబై మహానగరంలో జరిగిన 26/11 ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన ప్రధాన సూత్రధారి తహవ్వూర్ రానా ఈరోజు (ఏప్రిల్ 9) భారత్కి చేరుకోనున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో ఢిల్లీ,ముంబైలోని జైళ్లలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం,అమెరికా న్యాయ వ్యవస్థ నుంచి వచ్చిన సిఫారసుల మేరకు ఢిల్లీ,ముంబై జైళ్లలో తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారు.
తహవ్వూర్ రానా తొలి కొన్ని వారాల పాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)ఆధీనంలో ఉండే అవకాశముందని అంచనా.
ఈ విచారణను జాతీయ భద్రతా సలహాదారు ఏ.కే. దోవల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. ఆయన,హోం మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు
వివరాలు
ముంబైలో జరగిన ఉగ్రదాడులపై రానా ఆనందం
తహవ్వూర్ రానా పాకిస్థాన్ మూలాలున్న కెనడియన్ పౌరుడు.ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయిబాలో (ఎల్ఈటి) కీలక సభ్యుడిగా పనిచేశాడు.
ఇతను తన సహచరుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ (అలియాస్ దావూద్ గిలానీ)కి పాస్పోర్ట్లను సమకూర్చినట్టు గుర్తించబడింది.
హెడ్లీ ఆ పాస్పోర్ట్లను ఉపయోగించి భారత్లో ప్రవేశించి,లక్ష్యాల ఎంపికలో కీలక పాత్ర వహించాడు.
2008 నవంబర్ 26న ముంబైలో జరగిన ఉగ్రదాడులపై రానా ఆనందం వ్యక్తం చేశాడు.
అంతేకాకుండా, ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు మరణానంతరం పాకిస్తాన్ అత్యున్నత సైనిక గౌరవాలు ఇవ్వాలని పేర్కొన్నాడు.
వివరాలు
2019 నుండి మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల ఫలితం
ఈ దాడుల్లో పాల్గొన్న లష్కర్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ను విచారణ అనంతరం 2012లో ఉరిశిక్ష అమలు చేశారు.
తహవ్వూర్ రానా భారత్కు అప్పగింత విషయమై, గత ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు.
ఈ అప్పగింత 2019 నుండి మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల ఫలితంగా జరిగింది.
భారత్ 2019 డిసెంబర్లో తహవ్వూర్ రానాను అప్పగించాల్సిందిగా అమెరికాను కోరింది.
దీంతో అతని భారత్కు రాకకు మార్గం సుగమం అయింది. తహవ్వూర్ రానా భారత్కు చేరుకున్న తర్వాత, అతనిని తీహార్ జైలులో ఉంచే అవకాశముందని, ఇప్పటికే అక్కడ దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.