Page Loader
Sourav Ganguly: సౌరవ్‌ గంగూలీ ఫ్యామిలీకి తృటిలో తప్పిన ప్రాణాపాయం.. పూరీ బీచ్‌లో తలకిందులైన స్పీడ్‌బోటు 
పూరీ బీచ్‌లో తలకిందులైన స్పీడ్‌బోటు

Sourav Ganguly: సౌరవ్‌ గంగూలీ ఫ్యామిలీకి తృటిలో తప్పిన ప్రాణాపాయం.. పూరీ బీచ్‌లో తలకిందులైన స్పీడ్‌బోటు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2025
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరబ్ గంగూలీ కుటుంబ సభ్యులు తృటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకున్నారు. ఆదివారం ఒడిశాలోని పూరి బీచ్ వద్ద స్నేహాశిష్ గంగూలీ (సౌరవ్ గంగూలీ సోదరుడు) తన భార్య అర్పితా గంగూలీతో కలిసి విహారయాత్రలో పాల్గొంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తున్న స్పీడ్ బోట్ ఆకస్మాత్తుగా మునిగిపోవడంతో గంగూలీ దంపతులు తప్పించుకున్నారు. ఈ సంఘటన జరుగుతున్న సమయంలో వారు సముద్ర తీరాన వాటర్ స్పోర్ట్స్‌ను ఆస్వాదిస్తున్నారు. ఈ ప్రమాదం విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైరల్ వీడియోలో లైఫ్‌గార్డ్‌లు సముద్రంలో బోటును తలకిందులుగా ఉన్న స్థితిలో చూసి ప్రయాణికులను రక్షించేందుకు శ్రమిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అధికారుల సహాయంతో రబ్బరు ఫ్లోట్‌లు ఉపయోగించి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు.

వివరాలు 

అల ఒక్కసారిగా బోటును ఢీకొట్టింది 

ఈ ఘటనపై స్పందించిన అర్పితా గంగూలీ, బోటు సామర్థ్యం తక్కువగా ఉండటం, బాగా తేలికపాటిగా ఉండటం వల్లే అది మునిగిపోయిందని అన్నారు. "సముద్రం ఇప్పటికే చాలా అల్లకల్లోలంగా ఉంది.. ఆ బోటులో పదిమంది ప్రయాణించగల సామర్థ్యం ఉన్నప్పటికీ, మేము కేవలం ముగ్గురు నుంచి నలుగురు మాత్రమే ప్రయాణించాము. ఆ రోజు సముద్రంలోకి వెళ్ళిన చివరి బోటు ఇదే. మేము కొంత ఆందోళన వ్యక్తం చేశాం కానీ బోటు ఆపరేటర్లు అంతా సురక్షితమే అని భరోసా ఇచ్చారు" అని అర్పితా వివరించారు. సముద్రంలోకి వెళ్లిన కొద్ది సేపటికే పెద్ద అల ఒక్కసారిగా బోటును ఢీకొట్టిందని ఆమె చెప్పారు.

వివరాలు 

జల క్రీడలను నిలిపివేయాలంటూ విజ్ఞప్తి చేస్తా : అర్పితా గంగూలీ

"లైఫ్‌గార్డ్‌లు వచ్చి మమ్మల్ని రక్షించకపోతే మేము బతికి బయటపడే అవకాశం ఉండేది కాదు. బోటులో ఎక్కువ మంది ఉండి ఉంటే బహుశా ఇది తిరగబడేది కాదు" అని ఆమె అభిప్రాయపడ్డారు. బోటును నడిపే ఆపరేటర్ల నైపుణ్యంపై అధికారుల దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. అంతేకాకుండా, పూరి బీచ్‌లో జరిగే ఈ జల క్రీడలను పూర్తిగా నిషేధించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. "ఇక్కడ సముద్రం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. నేను కోల్‌కతాకు తిరిగి వెళ్లిన తర్వాత ఒడిశా పోలీస్ సూపరింటెండెంట్‌తో పాటు ముఖ్యమంత్రికి కూడా లేఖ రాస్తాను. ఇందులో జల క్రీడలను నిలిపివేయాలంటూ విజ్ఞప్తి చేస్తాను" అని అర్పితా గంగూలీ స్పష్టంగా తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో