
NEET UG 2025: 120 కి పైగా టెలిగ్రామ్,ఇన్స్టాగ్రామ్ ఛానెల్లపై'నీట్'చర్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ UG 2025 పరీక్షను కేంద్రంగా చేసుకొని, తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కఠిన చర్యలు తీసుకుంది.
పరీక్షకు సంబంధించిన పొరపాటు సమాచారాన్ని సోషల్ మీడియాలో వ్యాపింపజేస్తున్న సుమారు 120కి పైగా అకౌంట్లను గుర్తించి, వారిపై కేసులు నమోదు చేసింది.
గుర్తించిన అకౌంట్లలో 106 టెలిగ్రామ్ ఛానల్స్, 16 ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఉన్నట్లు ఎన్టీఏ వర్గాలు వెల్లడించాయి.
ఈ కేసులను మరింత దర్యాప్తు కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కు పంపించినట్లు సమాచారం.
అంతేకాదు, తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు ఈ అకౌంట్లను తొలగించాలంటూ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంస్థలను ఎన్టీఏ అభ్యర్థించినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఫిర్యాదు చేయడానికి వెబ్సైటు
పరీక్షపై తప్పుడు వదంతులు, వెబ్సైట్ల ద్వారా నకిలీ సమాచారం, లేదా ప్రశ్నాపత్రాలను అందించగలమని చెప్పే వ్యక్తుల గురించి ఫిర్యాదు చేయడానికి, ఎన్టీఏ ఇటీవల ఒక ప్రత్యేక వేదికను ప్రారంభించింది.
ఈ వేదిక ద్వారా https://neetclaim.centralindia.cloudapp.azure.com/ అనే లింక్ను ఉపయోగించి విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.
ఇప్పటివరకు ఈ లింక్కు 1500కు పైగా ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో ఎక్కువశాతం టెలిగ్రామ్ ఛానల్ లింకులు ఉన్నాయని తెలుస్తోంది.
ఇక మరోవైపు, మే 4న జరగనున్న NEET UG 2025 పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం అడ్మిట్ కార్డులు ఇప్పటికే విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.