
Coronavirus:విశాఖలో కొత్త వేరియంట్ కలకలం.. ఒమిక్రాన్ బీఏ.2 నిర్ధారణ
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణంలో గత నెలలో నమోదు అయిన కోవిడ్-19 కేసుల నమూనాలను పుణెకు పంపించి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)లో పరీక్షించగా, అవి ఒమిక్రాన్ వేరియంట్లోని బీఏ.2 రూపాంతరంగా తేలినట్టు అధికార వర్గాలు ధ్రువీకరించాయి.
విశాఖ కేజీహెచ్ వర్గాలు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాయి. అయితే ఈ వేరియంట్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ కేసులు కొద్దిగా పెరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నా, రికార్డుల్లో మాత్రం అవి పూర్తిగా ప్రతిబింబించడం లేదు.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది.
Details
ప్రతిరోజూ వెయ్యి పరీక్షలు నిర్వహించాలి
ప్రతిరోజూ కనీసం వెయ్యి పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
పాత ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో (జీజీహెచ్) రోజుకు 100 పరీక్షల మేరకు, కొత్త జీజీహెచ్ల్లో రోజుకు 50 పరీక్షల మేరకు టెస్టింగ్ కిట్లను సిద్ధం చేసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
ఇక ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ నేతృత్వంలో కొవిడ్ పరీక్షల నిర్వహణ, లబ్ధిదారులకు అందుబాటులో ఉన్న ప్రయోగశాలలు, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ ప్లాంట్లు తదితర అంశాలపై ప్రత్యేక సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.
ఇందినిబట్టి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మరలా అప్రమత్తమవుతూ, ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ప్రజలు వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించడమే ప్రధానంగా సూచిస్తున్నారు.