
Op Sindoor: ఆపరేషన్ సిందూర్ వేళ తోక ముడిచిన పాక్ నేవీ.. కరాచీ నుంచి నౌకలు అదృశ్యం
ఈ వార్తాకథనం ఏంటి
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ నేవీకి చెందిన యుద్ధ నౌకలు భారత క్షిపణుల నుంచి రక్షణ కోసం సుదూర ప్రాంతాలకు తరలించారు. ఈ సంఘటన తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు లభించిన ఉపగ్రహ చిత్రాల ద్వారా బయటపడింది. కరాచీ నౌకా స్థావరంలో ఉండాల్సిన కొన్ని వార్షిప్లను వాణిజ్య టెర్మినల్స్ లోకి తరలించి నిల్వ చేశారు,మిగతా నౌకలు ఇరాన్ సరిహద్దులో ఆశ్రయం పొందినట్లు కనిపించింది. మే 8న ఉపగ్రహ చిత్రాల్లో కరాచీ నౌకా స్థావరంలో ఎలాంటి వార్షిప్లు కనిపించలేదు. కాగా, అదేనెల 10న కేవలం 100 కిలోమీటర్ల దూరంలో గ్వదార్ పోర్ట్లో 7 వార్షిప్లు దర్శనమిచ్చాయి. వీటిలో చైనాలో తయారైన జుల్ఫికర్ శ్రేణి ఫ్రిగెట్లు ఉన్నాయి.
వివరాలు
'ఆపరేషన్ పైథాన్' పేరిట విధ్వంసం
ఆపరేషన్ సిందూర్ ప్రారంభానికి సుమారు ఆరు నెలల ముందే చైనా నుండి నాలుగు జుల్ఫికర్ శ్రేణి నౌకలు వచ్చాయి. ప్రారంభోత్సవ సందర్భంలో పాక్ ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలో వీటిపై యాంటీషిప్ మిసైల్స్ ప్రయోగం చూపించారు. అయితే సైనిక ఘర్షణ ప్రారంభమవుతూనే, ఇవి నిర్ణీత నౌకాశ్రయాన్ని వదిలి వెళ్లిపోయాయి. 1971లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధ సమయంలో భారత్ దళాలు కరాచీ రేవును లక్ష్యంగా చేసుకొని 'ఆపరేషన్ పైథాన్' పేరిట విధ్వంసం సృష్టించాయి. అప్పుడు ఒక ఫ్లీట్ ట్యాంకర్, చమురు డిపోలు పూర్తిగా ధ్వంసమయ్యాయి, కొన్ని వాణిజ్య నౌకలు కూడా మునిగిపోయాయి.
వివరాలు
వీర మరణంపై మునీర్ కబుర్లు..
ఇటీవల వీర మరణంపై మునీర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. పాక్ ఆర్మీచీఫ్ అసిం మునీర్ ఓ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, భగవంతుడు తనను దేశరక్షణ కోసమే తయారుచేశాడని మునీర్ పేర్కొన్నారు. అంతకుమించి తనకు కావాల్సింది ఏమీ లేదని పేర్కొన్నారు. తాను ఒక సైనికుడినని.. వీరమరణమే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. మే 10న నూర్ఖాన్ ఎయిర్బేస్పై భారత దళాల దాడి సమయంలో మునీర్ ఓ రహస్య బంకర్లో కొన్ని గంటల పాటు తలదాచుకున్నట్లు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.