
Kashmir Terror Attack: భర్తను చంపి..భార్యకు మోదీ పేరు ప్రస్తావిస్తూ ఏం చెప్పారంటే..
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్లోని పహల్గాం సమీపంలో ఉగ్రవాదులు మానవత్వాన్ని మర్చిపోయేలా దారుణానికి ఒడిగట్టారు.
సైనికుల వేషధారణలో వచ్చిన ఈ ఉగ్రవాదులు, తూర్పు కశ్మీర్లో ఉన్న బైసరన్ లోయ వద్ద పర్యాటకులను చుట్టుముట్టి దారుణంగా కాల్పులు జరిపారు.
ముఖ్యంగా పురుషులను లక్ష్యంగా చేసుకొని, వారిని అమానుషంగా కాల్చిచంపారు.
మతం పేరు అడిగి మరి కొంతమందిని గుర్తించి హత్యచేశారు. హిందువులని గుర్తించిన తర్వాత వారి తలపై నేరుగా తుపాకులతో కాల్చి హతమార్చారు.
ఈ ఉగ్రదాడి బైసరన్ లోయలో చోటుచేసుకుంది, ఇది పహల్గాం పట్టణానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది.
ప్రకృతి అందాలతో నిండి ఉన్న ఈ ప్రాంతాన్ని "మినీ స్విట్జర్లాండ్"గా పిలుస్తారు. అక్కడికి కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకోవచ్చు.
వివరాలు
ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత.. TRF ఉగ్రవాద సంస్థ ఉద్భవించింది
ఈ దాడిలో మొత్తం 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు.
హైదరాబాద్కు చెందిన నిఘా శాఖ అధికారి మనీశ్ రంజన్, కర్ణాటకకు చెందిన వ్యాపారి మంజునాథ్ కూడా మృతుల్లో ఉన్నారు.
ఈ దాడిలో గాయపడినవారు మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందినవారు.
ఈ దాడికి తమదే బాధ్యతనని 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)' అనే ఉగ్రసంస్థ ప్రకటించింది.
ఇది పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉంది. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత ఈ TRF ఉగ్రవాద సంస్థ ఉద్భవించింది.
వివరాలు
సంతోష్ జగ్దలేపై ఉగ్రవాదులు కాల్పులు
సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులకు పాల్పడటాన్ని చూసిన కొందరు భయంతో అక్కడే ఉన్న గుడారాల్లో దాక్కున్నారు.
కానీ, ఉగ్రవాదులు వారిని వెతికి పట్టుకుని కాల్చేశారు.ఈ సందర్భంగా పూణెకు చెందిన వ్యాపారవేత్త సంతోష్ జగ్దలే (54) తన కుటుంబంతో కలిసి టెంట్లో దాక్కున్నాడు.
ఉగ్రవాదులు అతన్ని గుర్తించి బయటకు రావాలని ఆదేశించారు.అతనిని ఇస్లామిక్ ప్రార్థన చదవమని చెప్పారు.
అయితే సంతోష్ అంగీకరించకపోవటంతో,అతనిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.ఇక మరోవైపు, కర్ణాటకలోని షిమొగాకు చెందిన మంజునాథ్ తన భార్య పల్లవి, కుమారుడు అభిజయ్తో కలిసి పహల్గాం వెళ్లారు.
వివరాలు
మోదీకి చెప్తే చెప్పు..
అక్కడ కూడా ఉగ్రవాదులు వారిని చుట్టుముట్టారు. మంజునాథ్ను కాల్చిచంపారు.
ఈ దృశ్యం మొత్తం తన కన్నుల ముందే జరిగినట్టు ఆయన భార్య పల్లవి కన్నీరుమున్నీరవుతూ వివరించారు.
"నా భర్తను నా కళ్ల ముందు కాల్చారు.. అక్కడికక్కడే మరణించాడు. నా భర్తను చంపారుగా నన్ను కూడాచంపేయండి అంటూ ఉగ్రవాదులను వేడుకున్నా.. వాళ్లు మాత్రం 'నిన్ను మేమేమీ చెయ్యం.. ఇక్కడి నుంచి వెళ్లిపో.. మోదీకి చెప్తే చెప్పు..' అని అన్నారు," అని ఆమె కన్నీటితో చెప్పారు.