Page Loader
Terror Attack: కశ్మీర్ ఉగ్రదాడి వెనుక చైనా ప్రయోజనాలతో లింకు పెట్టిన పాక్ ఉగ్రవాద సంస్థ
కశ్మీర్ ఉగ్రదాడి వెనుక చైనా ప్రయోజనాలతో లింకు పెట్టిన పాక్ ఉగ్రవాద సంస్థ

Terror Attack: కశ్మీర్ ఉగ్రదాడి వెనుక చైనా ప్రయోజనాలతో లింకు పెట్టిన పాక్ ఉగ్రవాద సంస్థ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 22, 2024
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని గండేర్బల్ జిల్లా సోన్‌మార్గ్ సొరంగ నిర్మాణ ప్రదేశంలో జరిగిన దాడి ఉగ్రవాదుల కారణంగా ఆదివారం రాత్రి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను కఠినంగా పరిగణించిన భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపును తీవ్రంగా కొనసాగిస్తున్నాయి. ఈ దాడికి బాధ్యత వహిస్తూ పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా అనుబంధ సంస్థ 'ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌' (TRF) ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటనతో చైనా ప్రయోజనాలు ఈ దాడి వెనుక ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

వివరాలు 

దాడికి చైనా మద్దతు 

జెడ్-మోర్ సొరంగ నిర్మాణ ప్రదేశంలో దాడిచేసిన TRF అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ-ఫాసిస్ట్ ఫ్రంట్‌ (PAFF) ఈ దాడిని వ్యూహాత్మక చర్యగా పేర్కొంది. 'తూర్పు సరిహద్దుల్లో భారత సైన్యం మోహరింపునకు ఆటంకం కలిగించడమే లక్ష్యంగా ఈ దాడి జరిగింది' అని వారు ప్రకటించారు. 'ఈ దాడి మేము, మా మిత్రదేశం చైనా ప్రయోజనాలకు అనుకూలంగా ఉందని' అన్నారు. అయితే చైనా, పాకిస్థాన్‌ల మధ్య వ్యూహాత్మక సహకారం ఉన్నప్పటికీ, ఈ దాడికి చైనా మద్దతు ఇచ్చిందని నిర్ధారించడానికి ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. PAFF విడుదల చేసిన ప్రకటన తమ లక్ష్యాలను చైనా ప్రయోజనాలకు అనుగుణంగా సర్దుబాటు చేయడానికి వ్యూహాత్మకంగా చేసిన ప్రయత్నం మాత్రమేనని అధికారులు పేర్కొన్నారు.

వివరాలు 

కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి

శ్రీనగర్-లడఖ్ జాతీయ రహదారిపై ఉన్న సోన్‌మార్గ్ సొరంగం 6.5 కిలోమీటర్ల పొడవు గల ముఖ్యమైన నిర్మాణ ప్రాజెక్ట్. ఇది ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ అనుసంధానం చేయగల సాంకేతికతతో నిర్మించబడుతోంది. ఈ సొరంగం నిర్మాణ పనులు ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఏపీసీఓ ఇన్‌ఫ్రాటెక్ సంస్థచే జరుగుతున్నాయి, తదుపరి నెలలో ప్రారంభం కానుంది. ఉగ్రవాదులు స్థానికేతర కార్మికులను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో బిహార్‌కు చెందిన ఫహీమ్ నజీర్, మహ్మద్ హనీఫ్, అబ్దుల్ కలీమ్, మధ్యప్రదేశ్‌కు చెందిన అనిల్ శుక్లా, పంజాబ్‌కు చెందిన గుర్మీత్ సింగ్, జమ్మూ ఆర్కిటెక్ట్ ఇంజినీర్ శశిభూషణ్, బుద్గామ్‌కు చెందిన డాక్టర్ షానవాజ్ అహ్మద్ దర్‌లు ప్రాణాలు కోల్పోయారు.