Poonch Border : కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్.. భారత సైన్యం ధీటైన సమాధానం
ఈ వార్తాకథనం ఏంటి
నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో బుధవారం సాయంత్రం పాకిస్థాన్ సైన్యం అనేక రౌండ్లు కాల్పులు జరిపింది.
దీనికి భారత సైన్యం తగిన ప్రతిస్పందన ఇచ్చింది. భారత సైన్యం ప్రతీకార చర్య చేపట్టిన తర్వాత, పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి.
పాకిస్థాన్ సైన్యం తరచూ ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతూ భారత సైనికులను లక్ష్యంగా చేసుకుంటోంది. కాల్పుల అనంతరం ఎల్ఓసీ వద్ద ఉద్రిక్తత పెరిగింది.
భారత సైన్యం సరిహద్దుల్లో భద్రతను మరింత కఠినతరం చేసింది. సైనికులను లక్ష్యంగా చేసేందుకు ఉగ్రవాదులు ముళ్ల తీగల కంచె దగ్గర ఐఈడీ అమర్చారని వర్గాలు తెలిపాయి.
Details
పాకిస్తాన్కు ఎదురుదెబ్బ
పూంచ్ సెక్టార్లో ల్యాండ్మైన్ పేలుడు చోటుచేసుకోగా, ఒక భారత సైనికుడు గాయపడినట్లు సమాచారం. భారత సైన్యం జరిపిన ప్రతీకార కాల్పుల కారణంగా పాకిస్తాన్ సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది.
పాకిస్తాన్ సైన్యంలో కూడా మరణాలు సంభవించినట్లు వార్తలొస్తున్నాయి. గత వారం రోజుల్లో పాకిస్తాన్ తరఫున ఇలాంటి అనేక కాల్పుల ఘటనలు నమోదయ్యాయి.
ఫిబ్రవరి 8న రాజౌరిలో గస్తీ తిరుగుతున్న భారత సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీనికి భారత సైన్యం ధీటైన సమాధానం ఇచ్చింది.
అదనంగా నౌషెరా సెక్టార్లో స్నిపర్ కాల్పులు జరగగా ఒక భారత ఆర్మీ సైనికుడు గాయపడ్డాడు.
Details
ఇద్దరు సైనికులు మృతి
నిన్న జమ్మూలోని అఖ్నూర్లోని ఎల్ఓసీ సమీపంలో ఉగ్రవాదులు ఐఈడీ పేల్చారు. ఈ దాడిలో ఒక కెప్టెన్ సహా ఇద్దరు సైనికులు అమరులయ్యారు. మరో సైనికుడు గాయపడ్డాడు.
కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదులపై భారత సైన్యం దాడులు జరిపిన తర్వాత పాకిస్తాన్ జమ్మూ ప్రాంతంలో స్థిరతకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తోంది.
ఈ నెలలో రాజౌరి జిల్లా కేరి సెక్టార్లోని ఎల్ఓసీ వద్ద ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన భారత సైన్యం వెంటనే చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేసింది.
సరిహద్దుల్లో పాక్ కుట్రలను అణచివేయడంలో భారత సైన్యం అగ్రస్థానంలో కొనసాగుతోంది.