Page Loader
PM Modi- JD Vance: ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ, వాన్స్‌ సమీక్ష.. సాంకేతికత,రక్షణపై దృష్టి 
ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ, వాన్స్‌ సమీక్ష.. సాంకేతికత,రక్షణపై దృష్టి

PM Modi- JD Vance: ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ, వాన్స్‌ సమీక్ష.. సాంకేతికత,రక్షణపై దృష్టి 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2025
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న వేళ,ఈ చర్చల పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ,అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల ప్రజలకు లాభదాయకంగా ఉండే విధంగా,ఇంధనం,వ్యూహాత్మక సాంకేతికత,రక్షణ వంటి కీలక రంగాలలో పరస్పర సహకారాన్ని మరింతగా విస్తరించాల్సిన అవసరాన్నివారు హైలైట్‌ చేశారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్‌ సోమవారం భారత్‌కు చేరుకున్నారు. దిల్లీలో జరిగిన భేటీలో ఆయన ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతిపై సమీక్ష జరిపారు. అంతేకాక,రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం సహా పలు ప్రాంతీయ,అంతర్జాతీయ అంశాలపై మంతనాలు సాగించారు. సమస్యల పరిష్కారానికి దౌత్యం, చర్చలే ప్రధాన మార్గమని వారు అభిప్రాయపడ్డారు.

వివరాలు 

అమెరికా అధికారుల కోసం ప్రధాని మోదీ నివాసంలో ప్రత్యేక విందు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఏడాది భారత్‌ను సందర్శించనుండగా,ఆ పర్యటన కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ప్రధాని మోదీ వాన్స్‌తో తెలిపారు. ఈ భేటీలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌,జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ తదితరులు కూడా పాల్గొన్నారు. వాన్స్‌ పర్యటనలో ఆయన భార్య ఉషా చిలుకూరి కూడా పాల్గొన్నారు.ఆమె తెలుగు మూలాలున్నవారిగా గుర్తింపు పొందారు. వాన్‌సతోపాటు వచ్చిన అమెరికా అధికారుల కోసం ప్రధాని మోదీ తన నివాసంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాన్స్‌ దంపతులతో మోదీ కలసి స్నేహపూర్వకంగా సంభాషించారు. వారి పిల్లలతో సరదాగా క్షణాలు గడిపారు,చిన్నారులకు నెమలి పింఛాలను బహుమానంగా అందించారు. ఉషా చిలుకూరితో కూడా మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు.

వివరాలు 

అక్షర్‌ధామ్‌ ఆలయ సందర్శన

ఈ హృద్యమైన క్షణాలను ప్రధాని తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. దిల్లీ పర్యటన ప్రారంభంలో, అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్‌ 'ఎయిర్‌ఫోర్స్‌-2' విమానంలో వచ్చిన వెంటనే పాలం ఎయిర్‌బేస్‌లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్వాగతం పలికారు. అనంతరం వాన్స్‌ దంపతులు తమ పిల్లలతో కలిసి ప్రసిద్ధ స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ ఆలయాన్ని సందర్శించారు. అద్భుతమైన శిల్పకళా వైభవంతో అలరించే ఈ ఆలయం వారి పిల్లల్ని ఎంతో ఆకర్షించిందని వాన్స్‌ ఆలయ అతిథుల పుస్తకంలో రాశారు.

వివరాలు 

సెంట్రల్‌ కాటేజ్‌ ఇండస్ట్రీస్‌ ఎంపోరియంను సందర్శించిన వాన్స్‌ కుటుంబం

ఈ పర్యటనలో వాన్స్‌ కుటుంబం స్థానిక జన్‌పథ్‌ ప్రాంతంలోని సెంట్రల్‌ కాటేజ్‌ ఇండస్ట్రీస్‌ ఎంపోరియం (CCIE)ను కూడా సందర్శించింది. వారి ముగ్గురు పిల్లలు — ఇవాన్‌ (8), వివేక్‌ (5), మీరాబెల్‌ (3) — భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. ఇవాన్‌, వివేక్‌ కుర్తా పైజామాలు ధరించగా, మీరాబెల్‌ అనార్కలీ సూట్‌కు జాకెట్‌ జతచేసి కనిపించింది. ఈ ముచ్చటైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్‌ అయ్యాయి.