రాష్ట్రపతిని కలిసిన ప్రతిపక్ష నేతల బృందం; మణిపూర్ పరిస్థితిపై మెమోరాండం అందజేత
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని 'ఇండియా' కూటమికి చెందిన 31 మంది ప్రతిపక్ష నేతల బృందం బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. మణిపూర్లో పరిస్థితిపై మెమోరాండం సమర్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మణిపూర్లో పర్యటించి రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేలా ఒత్తిడి తేవాలని రాష్ట్రపతికి ప్రతిపక్ష నేతలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. అందరం రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించినట్లు పేర్కొన్నారు. మణిపూర్లో మహిళలపై అఘాయిత్యాలు, పునరావాసం, ఇతర పరిస్థితులపై రాష్ట్రపతికి వివరించామన్నారు.
మణిపూర్ నుంచి ఇద్దరు మహిళలను రాజ్యసభకు పంపాలి : ఖర్గే
మణిపూర్ నుంచి ఇద్దరు మహిళలను రాజ్యసభకు ఎంపిక చేయాలని రాష్ట్రపతిని కోరినట్లు ఖర్గే చెప్పారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో పరిస్థితులు కొంతైనా మెరుగు అవుతాయని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మణిపూర్లో పర్యటించి రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణ దిశగా అడుగులు వేయాలన్నదే తమ ప్రధాన ఉద్దేశం అని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు. మణిపూర్లో ఘర్షణ కారణంగా 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, 500 మందికి పైగా గాయపడినట్లు, 5,000పైగా ఇళ్లు దగ్ధమైనట్లు, దాదాపు 60,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని కాంగ్రెస్ పార్టీ మెమోరాండం పేర్కొంది.