
PM Modi: ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన ఖరారు.. పూర్తి వివరాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిది రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఈ పర్యటనలో ఆయన ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశానికి మొత్తం 10 దేశాల నేతలు హాజరుకానుండగా, గ్లోబల్ సౌత్కు చెందిన అనేక కీలక దేశాలతో భారత సంబంధాలను మరింత విస్తరించాలనే లక్ష్యంతో మోదీ తన పర్యటనను కొనసాగించనున్నారు. జూలై 9 వరకు సాగే ఈ పర్యటనలో మోదీ రెండు ఖండాల్లో పర్యటించనున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఒకే పర్యటనలో ఐదు దేశాలను సందర్శించడం మోదీకి ఇది రెండోసారి.
వివరాలు
ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి జూలై 3-4 తేదీల్లో మోదీ
పర్యటనకు శ్రీకారం చుట్టేలా ప్రధాని జూలై 2-3తేదీల్లో పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలో పర్యటిస్తారు. ఇది మోదీకి ఘనాకు తొలి ద్వైపాక్షిక పర్యటన కాగా,మూడు దశాబ్దాల విరామం తర్వాత ఓ భారత ప్రధాని ఘనాను సందర్శిస్తున్నారు. ఈసందర్భంగా ఘనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భద్రత,ఇంధనం,ఆర్థిక వ్యవహారాలపైనా, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపైనా చర్చలు జరుపనున్నారు. అనంతరం అక్కడి పార్లమెంటులో ఆయన ప్రసంగించనున్నారు.తర్వాత జూలై 3-4తేదీల్లో మోదీ కరేబియన్ ప్రాంతంలోని ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి చేరుకుంటారు. ఈపర్యటనలో ఆయన అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కంగలూ,ప్రధాన మంత్రి కమలా పెర్సాద్-బిస్సేసర్లతో సమావేశమవుతారు. భారత్-ట్రినిడాడ్ మధ్య ఉన్న సంబంధాలను మరింత బలపరిచే దిశగా చర్చలు జరపనున్నమోదీ, అనంతరం ఆ దేశ పార్లమెంటు సంయుక్త సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
వివరాలు
17వబ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ
ఆపై జూలై 4-5 తేదీల్లో ప్రధాని అర్జెంటీనాలో పర్యటిస్తారు.అక్కడి అధ్యక్షుడు జేవియర్ మిలే ఆహ్వానం మేరకు ఈ పర్యటనను మోదీ చేపడుతున్నారు. ఇరుదేశాల మధ్య రక్షణ,వ్యవసాయం,మైనింగ్,చమురు,సహజ వాయువు,పునరుత్పాదక ఇంధనాలు, వాణిజ్యం,పెట్టుబడులు,ప్రజల మధ్య సంబంధాలు వంటి అనేక రంగాల్లో సహకారం మరింత విస్తరించే అంశాలపై ప్రధానుల మధ్య చర్చలు జరగనున్నాయి. జూలై 5-8 తేదీల మధ్యలో ప్రధాని బ్రెజిల్ పర్యటనను కొనసాగిస్తారు. అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఆహ్వానం మేరకు మోదీ బ్రెజిల్కు వెళ్లి రియో డి జనీరోలో జరగనున్న 17వబ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. అనంతరం బ్రెజిల్ రాజధాని బ్రసిలియాలో కూడా పర్యటిస్తారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ఇతర దేశాధినేతలతో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.
వివరాలు
నేతుంబో నంది-న్దైత్వా ఆహ్వానం మేరకు ప్రధాని నమీబియా పర్యటన
చివరగా, జూలై 9న ఆఫ్రికా ఖండంలోని నమీబియాను ప్రధాని సందర్శించనున్నారు. అధ్యక్షుడు నేతుంబో నంది-న్దైత్వా ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతుంది. ఇది మోదీకి నమీబియాలో తొలి పర్యటన. ఈ సందర్భంగా అధ్యక్షుడు నంది-న్దైత్వాతో సమావేశం అయ్యి, ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. అలాగే, నమీబియా స్వాతంత్ర్య పోరాట నేత మరియు వ్యవస్థాపక పితామహుడైన సామ్ నుజోమాకు మోదీ నివాళులు అర్పించనున్నారు. అనంతరం నమీబియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించనున్నారు.