Page Loader
IMD Alert: తీపికబురు.. రేపటినుంచి దేశవ్యాప్తంగా వర్షాలు.. ఐఎండీ అలర్ట్!
తీపికబురు.. రేపటినుంచి దేశవ్యాప్తంగా వర్షాలు.. ఐఎండీ అలర్ట్!

IMD Alert: తీపికబురు.. రేపటినుంచి దేశవ్యాప్తంగా వర్షాలు.. ఐఎండీ అలర్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 25, 2025
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర వాతావరణ శాఖ దేశ ప్రజలకు తీపి కబురు అందించింది. రేపటి నుంచి ఈ నెల 30 వరకు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినప్పటికీ, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు నిరాశలో మునిగిపోయారు. కానీ ఇప్పుడు ఆకాశం వైపు చూసే రైతులకు శుభవార్త అందింది. దేశమంతా భారీ వర్షాల ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రాష్ట్రాలను హెచ్చరించింది. జూన్ 26 నాటికి రుతుపవనాలు ఢిల్లీకి చేరనున్నాయని, ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు ఐఎండీ వెల్లడించింది.

Details

సూరత్‌లో పాఠశాలలకు సెలవులు

రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఇక ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతూ రహదారులు జలమయమై ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా సూరత్‌లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మహారాష్ట్రలో గోదావరి నది ఉప్పొంగడంతో నాసిక్‌లోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అలాగే కేరళలోని అనేక జిల్లాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. దేశంలోని పశ్చిమ, మధ్య, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. అయితే జమ్మూ ప్రాంతంలో వేడిగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది.

Details

అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

జూన్ 30 వరకు పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. కోంకణ్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా అతి భారీ వర్షాల ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. సౌరాష్ట్ర, కచ్‌లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. జూన్ 28 వరకు బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముంది.

Details

40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం

తదుపరి ఏడు రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అప్పుడప్పుడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే, దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, యానాం, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది.