Page Loader
Medaram Jatara 2025: సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ప్రారంభం.. లక్షలాదిమంది భక్తుల రాక
సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ప్రారంభం.. లక్షలాదిమంది భక్తుల రాక

Medaram Jatara 2025: సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ప్రారంభం.. లక్షలాదిమంది భక్తుల రాక

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 12, 2025
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. వనదేవతలు సమ్మక్క-సారలమ్మల చిన్నజాతర నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించనున్నారు. సాధారణంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం మహాజాతర నిర్వహించడం పరిపాటిగా మారింది. మధ్యలో వచ్చే ఏడాదిలో మాత్రం మినీ జాతరను నిర్వహిస్తారు. ఈ మినీ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ఈ రోజు మండమెలిగే పండుగతో మినీ జాతరను ప్రారంభిస్తారు. గురువారం మండమెలిగే పూజలు నిర్వహించగా, శుక్రవారం భక్తులు మొక్కులు చెల్లించుకునే కార్యక్రమం ఉంటుంది. శనివారం చిన్నజాతర నిర్వహించనున్నారు.

Details

రూ.5.30 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం

ఈ జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.5.30 కోట్లు కేటాయించింది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని, పోలీసులతో పాటు వివిధ శాఖల నుంచి వెయ్యి మందికి పైగా సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. మినీ జాతరకు సుమారు 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో సమ్మక్క-సారలమ్మల దర్శనం కోసం భక్తులు ఇప్పటికే భారీ సంఖ్యలో మేడారం చేరుకోవడంతో పరిసర ప్రాంతాలు భక్తులతో పోటెత్తాయి.