
Supreme Court: లలిత్మోదీకి సుప్రీంలో చుక్కెదురు.. పిటిషన్ను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెట్ లీగ్గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు,మాజీ ఛైర్మన్ అయిన లలిత్ మోదీకి సుప్రీంకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం (FEMA) ఉల్లంఘన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ.10.65 కోట్లు జరిమానా విధించగా, ఆ మొత్తాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చెల్లించాలన్న ఆయన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ కేసును విచారించిన జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన ధర్మాసనం, లలిత్ మోదీకి తనను తాను చట్టపరంగా రక్షించుకునే హక్కు ఉన్నా, ఆ పిటిషన్కు న్యాయపరమైన బలం లేదని స్పష్టం చేసింది.
వివరాలు
బాంబే హైకోర్టు ర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంని ఆశ్రయించిన లలిత్ మోదీ
ఇటీవల గత ఏడాది డిసెంబర్లో, ఈడీ విధించిన రూ.10.65 కోట్ల జరిమానా తన అధికారిక హోదాలో ఉన్నపుడు విధించబడిందని పేర్కొంటూ, బీసీసీఐ చెల్లించేలా ఆదేశించాలంటూ మోదీ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. తన ఐపీఎల్ ఛైర్మన్ హోదాలో ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలపై నష్టపరిహారం కల్పించాల్సిన బాధ్యత బీసీసీఐదే అని పిటిషన్లో తెలిపారు. అయితే మోదీ వాదనలో చట్టపరంగా బలమేమీ లేదని పేర్కొంటూ, ఆ పిటిషన్ను బాంబే హైకోర్టు తిప్పికొట్టింది. అంతేకాకుండా, ఆయనపై రూ.1 లక్ష జరిమానా విధించింది. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మోదీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా ఆయనకు అనుకూలంగా తీర్పు రాలేదు.
వివరాలు
లలిత్ మోదీపై ఆరోపణలు
ఐపీఎల్కు చైర్మన్గా ఉన్న సమయంలో వేల కోట్ల రూపాయల ఆర్థిక దుర్వినియోగం చేశారని లలిత్ మోదీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2010లో ఆయన లండన్కు పారిపోయి, అప్పటి నుంచీ అక్కడే నివసిస్తున్నారు. ఆయనను తిరిగి భారత్కు తీసుకురావడానికి భారత ప్రభుత్వం తరఫున క్రమం తప్పకుండా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.