
Amit Shah: తమిళనాడులో ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది: అమిత్ షా
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే తన ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, బీజేపీ నేత అమిత్ షా ఒక స్థానిక న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల అనంతరం బీజేపీ, అన్నాడీఎంకే (AIADMK) సహకారంతో కూడిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నాడీఎంకే తరఫునే ఉంటారని కూడా ఆయన చెప్పారు. అయితే, పార్టీ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి (ఈపీఎస్) పేరు మాత్రం ఆయన ప్రస్తావించలేదు.
వివరాలు
డీఎంకే ప్రభుత్వం అవినీతి హద్దులు దాటి పోయింది
అదే సమయంలో,1967 తర్వాత నుంచి తమిళనాడులో ఏ ద్రవిడ పార్టీ కూడా అధికారాన్ని తమ మిత్ర పార్టీలతో భాగస్వామ్యం చేసుకోలేదన్న విషయం పరిగణనలోకి తీసుకుంటే, అమిత్ షా వ్యాఖ్యలకు ప్రాముఖ్యత సంతరించుకుంది. అలాగే, సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రీ కజగం (టీవీకే) ఎన్డీఏలో చేరే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు స్పందిస్తూ, "ఎన్నికలకు ఇంకా సమయం ఉంది" అని అమిత్ షా సమాధానమిచ్చారు. మరోవైపు,ప్రస్తుతం తమిళనాడులో ఉన్న డీఎంకే ప్రభుత్వం అవినీతి హద్దులు దాటి పోయిందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పంపిన రూ.450 కోట్ల విలువైన పోషకాహార కిట్లను రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించిందని, దానివల్ల పేద ప్రజలకు ఆహారం అందకుండా పోయిందని ఆయన విమర్శించారు.
వివరాలు
డీఎంకేపై ప్రజల్లో అసంతృప్తి
తమిళనాడు ప్రజల మనసు తాను అర్థం చేసుకున్నానని చెబుతూ, "డీఎంకేపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. వచ్చే ఎన్నికల్లో వారు డీఎంకేను అధికారం నుంచి తప్పకగా గద్దె దించుతారు" అని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.